ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, గృహిణులు బయటకు వెళ్లాలంటే బస్సులోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. హడావుడి బతుకుల మధ్య అన్నీ తొందర తొందరగా పనులు చక్కబెట్టుకుంటాం. ఇక బస్సు ఎక్కే సమయంలో కూడా కంగారుగా ఎక్కి, ఫాస్ట్గా దిగిపోతుంటాం.
నగరాల్లోనూ, గ్రామాల్లోనూ ఎక్కడికైనా ప్రయాణించాలంటే మనం ఎంచుకునే అత్యుత్తమ మార్గం బస్సు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, గృహిణులు బయటకు వెళ్లాలంటే బస్సులోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. హడావుడి బతుకుల మధ్య అన్నీ తొందర తొందరగా పనులు చక్కబెట్టుకుంటాం. ఇక బస్సు ఎక్కే సమయంలో కూడా కంగారుగా ఎక్కి, ఫాస్ట్గా దిగిపోతుంటాం. ఈ సందర్భాల్లో మన వెంట తీసుకెళ్లే లగేజీని మర్చిపోతూ ఉంటాం. ఇందులో డబ్బు, నగలు, విలువైన వస్తువులు, కాగితాలు ఉంటాయి. ఇక బస్సులో పోతే అవి దొరికే అవకాశాలు కూడా తక్కువ. అదే ఆర్టీసీ ఉద్యోగులకు దొరికితే అవి కొంత మేర సేఫ్ అని చెప్పొచ్చు. ఉద్యోగులు నిజాయితీగా ఉంటే కచ్చితంగా అవి పొగొట్టుకున్న వారికి దొరుకుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ.
చిత్తూరూ ఆర్టీసీ కండక్టర్ తన నిజాయితీని చాటుకున్నారు. బస్సులో మర్చిపోయిన బంగారాన్ని పొగొట్టుకున్న వారికి తిరిగి అప్పగించి శభాష్ అనిపించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. పుత్తూరు ఎన్జీవో కాలనీలో నివసిస్తున్న రిటైర్డ్ టీచర్ ప్రభాకర్ కుటుంబ సభ్యులు తిరుపతిలో ఓ కార్యక్రమానికి వచ్చారు. తిరిగి వెళ్లేందుకు తిరుపతి నుండి చిత్తూరు ఆర్టీసీకి చెందిన బస్సు ఎక్కారు. పుత్తూరు రాగానే.. తమ చేతిలో ఉన్న బ్యాగును మర్చిపోయి బస్సు దిగిపోయారు. ఆ బస్సు కండక్టర్ ఆ బ్యాగును గమనించి.. చూడగా బంగారు ఆభరణాలు కనిపించాయి. వెంటనే వాటిని డిపోలో సెక్యూరిటీకి అప్పగించారు. ఇంటికి వెళ్లాక.. ప్రభాకర్కు బస్సులో బ్యాగు మర్చిపోయామన్న సంగతి గుర్తొచ్చింది.
వెంటనే పరుగును పుత్తూరు డిపోకు చేరుకుని జరిగిందంతా చెప్పారు. అప్పటికే కండక్టర్ శేఖర్ వాటిని అక్కడ అప్పగించినట్లు చెప్పడంతో ఆనందంలో మునిగి తేలిపోయారు. వివరాలు కనుక్కొని ప్రభాకర్ కుటుంబానికి డిపో అసిస్టెంట్ మేనేజర్ బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును అందజేశారు. ఆ బంగారం విలువ సుమారు రూ. 6 లక్షల విలువ ఉంటుందని చెప్పారు. నిజాయితీగా వాటిని అప్పగించిన కండక్టర్ శేఖర్కు ప్రభాకర్ కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. కండక్టర్ను డిపో మేనేజర్ తో సహా, తోటి ఉద్యోగులంతా అభినందనలతో ముంచెత్తారు.