వర్షాలు దేశ వ్యాప్తంగా దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా వానలతో తడిసి ముద్దవుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇటు తెలంగాణలో ముసురు పట్టింది. ఎడతెరపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి.
వర్షాలు దేశ వ్యాప్తంగా దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా వానలతో తడిసి ముద్దవుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇటు తెలంగాణలో ముసురు పట్టింది. ఎడతెరపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి. కాస్తంతైనా విరామం ఇవ్వకుండా ఆకాశానికి చిల్లులు పడ్డట్లు వర్షాలు కురస్తూనే ఉన్నాయి. మూడు రోజుల నుండి ఆగకుండా కురస్తున్న వర్షానికి ఇళ్లల్లో నుండి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. హైదరాబాద్ మహా నగరమైతే వరద నీటిలో మునిగింది. తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వానలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి చెప్పనక్కర్లేదు. భారీగా కురుస్తున్న వర్షాలకు ఉభయ గోదావరి జిల్లాలోని లంక ప్రాంత వాసులు బెంబేలెత్తుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమౌతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టుల వద్ద వరద నీరు భారీగా చేరుతోంది.
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే రెండు రోజుల్లో ఒడిశాలోని పశ్చిమ- వాయవ్య దిశగా కదలనుంది. ఈ నెల 24న వాయవ్యం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ, ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తాయని, తూర్పు భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్య భారతదేశంలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురవనుండగా, పశ్చిమ భారతదేశంలోని కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలు, గుజరాత్లలో వచ్చే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 26 వరకు కొన్ని ప్రాంతాలో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఏపీలో కూడా వానల ప్రభావం కొనసాగనుంది.