బిజినెస్ డెస్క్- జియో.. దేశీయ మొబైల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. మొబైల్ యుగం రిలయన్స్ కు ముందు, ఆ తరువాత అని చెప్పడంలో ఏ మాత్రం అతియోశక్తి లేదేమో. ఇక జియో సైతం మొబైల్ ఇంటర్నెట్ రంగంలో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు రిలయన్స్ జియో, గూగుల్ భాగస్వామ్యంలో 5జీ ఫోన్ వచ్చేస్తోంది. జియో 5జీ ఫోన్ మన దేశంలో వచ్చేవారం లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీన జియో వార్షిక సదస్సు జరగనుంది. ఇందులో జియో 5జీ ఫోన్తో పాటు చవకైన ల్యాప్టాప్ కూడా రిలయన్స్ లాంచ్ చేయనుందని సమాచారం.
గత సంవత్సరం జరిగిన రిలయన్స్ వార్షిక సదస్సులో ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ తమ కంపెనీలో 7.7 శాతం వాటా కొనుగోలు చేసిందని జియో ప్రకటించింది. ఇందుకు గానూ 33 వేల 737 కోట్ల రూపాయల పెట్టుబడులను గూగుల్ తమ కంపెనీలో పెట్టిందని స్పష్టం చేసింది. జియో 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లు పూర్తిగా బయటకు రాలేదు. అయినప్పటికీ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకోనుందని మార్కెట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో 5జీ మొబైల్ కోసం గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే కస్టం సాఫ్ట్వేర్ను రూపొందిస్తోంది.
ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఆపరేటింగ్ కంటే డిఫరెంట్ గా ఈ ఆపరేటింగ్ సిస్టం ఉండనుందని తెలుస్తోంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల కోసం గూగుల్ ఈ ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టంను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇక జియో 5జీ ల్యాప్ టాప్ లను కూడా రిలయన్స్ లాంచ్ చేయబోతోందట. జియో బుక్ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్లు కూడా ఆన్లైన్లో లీకయ్యాయి. జియో 5జీ ల్యాప్ టాప్ లో 1,366 x 768 పిక్సెల్ రిజల్యూషన్ ఉన్న డిస్ ప్లేను అందించనున్నారట. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్పై ఈ ల్యాప్ టాప్ పనిచేస్తుందని చెబుతున్నారు. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో అండనున్నాయని సమాచారం.
ఈ ల్యాప్ టాప్ లో 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ కోసం స్నాప్ డ్రాగన్ ఎక్స్12 4జీ మోడెంను అమర్చారని డిజిటర్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ల్యాప్ టాప్లో ఒక మినీ హెచ్డీఎంఐ కనెక్టర్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉందట. ఆండ్రాయిడ్లో మరో వెర్షన్ ఆధారంగా రూపొందించిన జియో ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్టాప్ పనిచేయనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్రీ యాక్సెస్ యాక్సెలరోమీటర్, క్వాల్ కాం ఆడియో చిప్ కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం.