ఏం తినేటట్టు లేము, ఏం కొనేటట్టు లేము నాగులో నాగన్నా అంటూ ఓ సినిమా కవి అన్నట్లు.. ఇప్పుడు నిజంగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు సగటు మనిషి. ఎటు చూసిన ధరలు పెరుగుదలే. మొన్నటి మొన్న వంట నూనె ధరలు పెరిగితే.. ఇప్పుడు సిలిండర్ ధరలు పెరిగి.. సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి.
అటు నిత్యవసరాల ధరలు, ఇటు వంటనూనె ధరలు పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. అమ్ముదామంటే అడవి, కొందామంటే కొరివిలా తయారయ్యాయి కూరగాయలు, పండ్లు ధరలు. పెట్రో, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. మధ్యతరగతి కుటుంబం బతకడమే కష్టంగా ఉంది. వచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోక విలవిలలాడుతున్నాడు సామాన్యుడు. ఇంటిల్లిపాది సంపాదిస్తున్నబతుకు బండిని ఈడ్చడం భారంగా మారుతోంది. ఇప్పుడు వీరిపై మరో గుది బండ పడింది. సిలిండర్ ధరలు పెరిగాయి. ఇవి కూడా అమాంతం పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలపై మరింత భారం పడినట్లైంది.
ఈ సారి గృహా అవసరాల వంట గ్యాస్ తో పాటు అటు కమర్షియల్ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. మార్చి నెల ప్రారంభంలోనే ఈ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా పెంచేశాయి. వంట గ్యాస్ ధర రూ. 50 మేర పెరగ్గా.. అటు వాణిజ్య సిలిండర్ ధర రూ. 350 మేర ఎగబాకింది. సుమారు 8 నెలల తర్వాత ఇంటి గ్యాస్ ధర పెరగడం గమనార్హం. ఢిల్లీలో గృహ వినియోగ గ్యాస్ (14.2 కేజీలు) రూ. 1053 ఉండగా.. 50 రూపాయలు పెరిగి రూ. 1103కి చేరింది. ఇక వాణిజ్య సిలిండర్ ధర నిన్న రూ. 1769 ఉండగా..ఇవాళ అది 2119 రూపాయలకు చేరింది. అలాగే కోల్కతాలో చూస్తే.. దీని ధర రూ. 1870 నుంచి రూ. 2221కు పెరిగింది. ఇక ముంబైలో ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1721గా ఉండేది. ఇప్పుడు దీని రేటు రూ. 2071కు చేరింది.
చెన్నైలో ఈ సిలిండర్ ధర రూ. 2268కు పెరిగింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎల్పీజీ ధరలు పెరిగాయి. వంట గ్యాస్ ధర హైదరాబాద్ లో రూ. 50 పెరిగి.. మార్చి 1 నాటికి రూ. 1155కు చేరింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఈ రేటు రూ. 1161 పలుకుతోంది. కాగా గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది. ఇప్పుడు సబ్సిడీ ఎత్తి వేయడంతో సామాన్యులకు మరింత గుదిబండగా మారనుంది. అటు ఏం కొనలేక, ఏం తినలేక సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. దేశ వ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరగడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.