కేరళ- కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. దేశంలో రోజువారి కరోనా కేసులు బాగా తగ్గిపోయాయి. దీంతో అంతా కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఐతే ఇంతలోనే మరో మహమ్మారి ముంచుకొస్తోంది. జికా వైరస్ కేసులు భారత్ లో వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో జికా వైరస్ కేసు నమోదుకావడం కలకలం రేపుతోంది. జికా వైరస్ కేసులు నమోదయినట్టు కేరళ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది.
కేరళ రాజధాని త్రివేండ్రం జిల్లాలో మొత్తం 13 జికా వైరస్ కేసులు నమోదయినట్టు సమాచారం. కానీ దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్కు 19 మంది అనుమానితుల శాంపిళ్స్ ను పంపించగా, అందులో 13 మందికి జికా వైరస్ పాజిటివ్గా తేలిందని తెలుస్తోంది. ఈనెల 2న 24 ఏళ్ల గర్భిణిలో జికా వైరస్ ను గర్తించారు. జులై 7న ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
ఐతే పుట్టిన శిశువులో వైరస్ లక్షణాలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండ్ల కలక, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటివి జికా వైరస్ ప్రధాన లక్షణాలు. ఈ వైరస్ ఎడిస్ ఎనాఫిలస్ అనే దోమ వల్ల వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ రకం దోమలు కేరళలో చాలా పెద్ద సంఖ్యలో ఉండటంతో అక్కడ జికా వైరస్ కేసులు పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
జికా వైరస్ రోగనిరోధక వ్యవస్థ, నరాలపై దాడి చేస్తుంది. ఈ వైరస్ సోకిన కొంత మందిలో లక్షణాలు కనిపించకపోవచ్చని వైద్యులు అంటున్నారు. జికా వైరస్కు ప్రస్తుతం ఎటువంటి చికిత్సగాని, మందులు గాని లేవు. మొట్టమొదటి సారి 1947లో ఆఫ్రికాలోని ఉగాండలో జికా వైరస్ ను గుర్తించారు. తొలిసారి 1952లో ఈ వైరస్ మనుషులకు సోకడాన్ని గుర్తించారు. 2017లో తమిళనాడు,అహ్మదాబాద్ లో ఈ కేసులు కనిపించాయి.