తప్పు చేసి తప్పించుకోవడం అంత సులభం కాదు. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ప్రభుత్వాల చేతికి చిక్కక తప్పదు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రభుత్వ రంగ బ్యాంక్ లను నిండా ముంచి విదేశాలకి పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లకి ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ మైండ్ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. వారి, వారి కేసుల విచారణలో ఇప్పటి వరకు జప్తు చేసిన వేల కోట్ల రూపాయల ఆస్తులను వారు మోసం చేసిన బ్యాంక్ లకి, కేంద్రానికి బదిలీ చేసింది. దీంతో.., ఆర్ధిక నేరగాళ్ల వెన్నులో వణుకు మొదలైందని చెప్పుకోవచ్చు.
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు ముగ్గురు కలిపి బ్యాంక్స్ ని మోసం చేసిన మొత్తం 22 వేల 586 కోట్ల రూపాయలు. వీరి దెబ్బకి ఎక్కువగా నష్టపోయింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ కేసులపై దర్యాప్తు చేసిన ఈడీ.. వారి నుంచి 18 వేల 170 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. వీటిలో ఇప్పటి వరకు వరకు మొత్తం 9 వేల 371 కోట్ల విలువైన ఆస్తులు ఆయా బ్యాంకుల పరిధిలోకి చేరాయి. అంటే.. ఈ ముగ్గురి కారణంగా బ్యాంక్స్ నష్టపోయిన మొత్తంలో ఇప్పటి వరకు 40 శాతం పైగా రికవరీ అయినట్టు అయ్యింది. కోర్టులు, వ్యవస్థలు సహకరిస్తే మొత్తం డబ్బుని జప్తు చేయగలమని ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ ఇప్పటికే తేల్చి చెప్తోంది. మరోవైపు.. విజయ్ మాల్యాని కూడా తిరిగి భారత్ కి రప్పించడానికి మార్గం సులభం అవుతోండటం శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఏ ముగ్గురిని కనుక తిరిగి దేశానికి తీసుకునిరాగలిగితే మొత్తం సొమ్మును రాబట్టవచ్చని ఈడీ చెప్తోంది. మరి.., ఈ వ్యవహారంలో చివరికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.