ఆడపిల్ల పుడితే ఇంటికి కళ వస్తుంది అంటారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆడ పిల్లల పట్ల తల్లిదండ్రులు మక్కువ చూపిస్తున్నారు. పుట్టిన దగ్గర నుండి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ.. ఆమె ఆశయాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
ఆడపిల్ల పుడితే ఇంటికి కళ వస్తుంది అంటారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆడ పిల్లల పట్ల తల్లిదండ్రులు మక్కువ చూపిస్తున్నారు. పుట్టిన దగ్గర నుండి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ.. ఆమె ఆశయాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అదే ఒక్కటే కుమార్తె అయితే ఆమె ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాటగా సాగిపోతుంది ఆ ఇంట్లో. చక్కగా బొమ్మలా పెంచుకుంటున్న కుమార్తె.. కాసింత కనిపించకపోతేనే తల్లడిల్లిపోతుంది తండ్రి హృదయం. అలాంటిది జీవితాంతం ఆమె కనిపించదు అని తెలిస్తే.. అతడిని ఓదార్చడం ఎవ్వరి తరం కాదు. హనుమంత రెడ్డి, పుష్పలత దంపతులకు ఇదే జరిగింది. పుత్రికోత్సాహంతో ఉన్న ఆ తల్లిదండ్రులకు పుత్రికా శోకం మిగిలింది.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వాసి హనుమంత రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. తల్లిదండ్రుల కలలు, ఆశలపై నీళ్లు జల్లి కానరాని లోకాలకు తరలి వెళ్లిపోయింది ఆయన కుమార్తె నిఖిత. ఒక్కగానొక్క కుమార్తె నిఖితా రెడ్డి(15) విద్యుత్ షాక్తో మృతి చెందింది. గోరంట్ల మండలం పుట్ట గుండ్లపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన హనుమంత రెడ్డి, పుష్పలత దంపతులు. వీరికి కుమార్తె నిఖితా తొమ్మిదో తరగతి చదువుతోంది. మంగళవారం ఉదయం స్నానం చేసేందుకు బాత్రూములోకి వెళ్లింది. కుళాయిని తిప్పుతుండగా.. కరెంట్ షాక్ కొట్టి అక్కడిక్కడే మృతి చెందింది.
ఆమె అరుపులకు విన్న తల్లిదండ్రులు ఆమెను బాత్రూమ్ నుండి బయటకు తీసుకు వచ్చే సరికి విగతజీవిగా కనిపించింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు నిర్ధారించారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా కుళాయికి విద్యుత్ సరఫరా జరిగి.. షాక్ తగిలి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించగా.. సీఐ అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. ఒక్కాగానొక్క కుమార్తె చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం. వారు కంటతడి పెడుతున్న తీరు చూసి ఆ ఊరి ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు.