అమరావతి- తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం పాలకమండలి సహా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నామినేట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్కున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఇవ్వాలి, రాష్ట్రంలో ఏయే కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయాలనే జాబితాలు సిద్ధమైనట్లు సమాచారం. నామినేటెడ్ పదవులకు అర్హులుగా గుర్తించిన సుమారు 150 మంది పేర్లతో జాబితా సిద్ధం చేసినట్లు వైసీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. వీరందరికి ప్రాధాన్యతా క్రమంలో నామినేటెడ్ పదవులను త్వరలోనే కెటాయించనున్నారని తెలుస్తోంది.
మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు 50 శాతం పదవులు దక్కేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ప్రతి కార్పొరేషన్లో ఇదే పద్ధతిలో ప్రాతినిధ్యం ఉండేలా జాబితాలను రూపొందించినట్లు సమాచారం. అందువల్లే నామినేటెడ్ పదవుల భర్తీ కొద్దిగా ఆలస్యమవుతోందని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ నెల 30 నాటికి రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టులను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమైన నేతలకు ఎమ్మెల్సీ పదవులు దక్కకనున్నాయని సమాచారం.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ఈ నెల 30లోగా నియమించేందుకు ముఖ్యమంత్రి జగన్ సమాయుత్తం అయ్యారట. ఛైర్మన్గా తాజా మాజీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డినే మళ్లీ నియమించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ మళ్లీ రెండోసారి ఆ పదవి చేపట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి అంత ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో వైవీ సుబ్బారెడ్డి కాకపోతే టీటీడీ ఛైర్మన్ ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఇప్పటికే కొందరు ఆశావాహులు సీఎం జగన్ ను కలిసి తమ మనసులోని మాటను బయటపెట్టారట. కానీ జగన్ మాత్రం తన బాబాయి వైవీ సుబ్బారెడ్డినే టీటీడీ ఛైర్మన్గా నియమించే యోచనలో ఉన్నారని సమాచారం.