ఛత్తీస్గడ్లో విచిత్రమైన కేసు నమోదైంది. ఆవుపేడను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని కేసును ఫైల్ చేశారు. పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు. కోర్భా జిల్లాలోని ధురేనా గ్రామంలో రూ.1600 విలువ చేసే 800 కేజీల ఆవుపేడను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై గ్రామాధికారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం గ్రామంలో సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో పేడ చోరీ కావటం సంచలనమైంది. మన దేశంలో ఇది బాగానే దొరుకుతుంది. అలాంటి పేడను కూడా చోరీ చేశారంటే ఏమనుకోవాలి.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గోదాన్ న్యాయ యోజన అనే పథకం ఒకటి తెచ్చింది. దాని ద్వారా ప్రజల నుంచి ఆవుపేడను సేకరిస్తోంది. కేజీకి రూ.2 ఇస్తోంది. ఆ పేడతో వర్మీ కంపోస్ట్ తయారుచేయిస్తోంది. అలా ప్రభుత్వానికి పేడ అమ్ముకోవడానికే ఆ పేడను రెడీ చేసి పెట్టుకున్నాడు. దాన్ని అమ్ముకునే ఉద్దేశంతో దొంగలు ఎత్తుకుపోయారన్నమాట. చిత్రంగా ఉన్న ఈ కేసు దేశం మొత్తాన్నీ ఆలోచింపజేస్తోంది.
ఆవుపేడ చోరీ చేశాడనే కారణంతో ఓ ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. స్టాక్ లో నిల్వ ఉంచిన 35నుంచి 40 ట్రాక్టర్ల ఆవుపేడను సూపర్ వైజర్ చోరీ చేశాడు. ఆ పేడ విలువ సుమారు రూ.1.25లక్షల విలువ ఉంటుందని వారు చెప్పారు. సదరు ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు.