న్యూ ఢిల్లీ- తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి అప్పుడే మూడేళ్లు గడిచిపోయింది. సాధారణంగా ఐతే మరో రెండేళ్లలో ఎన్నికలు రావాలి. ఐతే 2018 మాదిరిగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగాణాలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ సారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ కంటే ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే చర్చ అధికార టీఆర్ ఎస్ పార్టీలోను జరుగుతోంది.
ఇదిగో ఇటువంటి సమయంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వంలోని కీలక మంత్రి కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని సదరు కేంద్ర మంత్రి చెప్పడంతో తెలంగాణలో ని రాజకీయ పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి.కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ముందస్తు ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
తెలంగాణ బీజేపీ నేతలతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం అయిన అమిత్ షా, మాటల సందర్బంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎన్నికల అంశాన్ని అమిత్ షా ప్రస్తావించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన రాష్ట్ర బీజేపీ నేతలతో కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లొచ్చని అమిత్ షా అన్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు.
టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా సూచించారు. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే తెలంగాణ బీజేపీ నేతలను అలెర్ట్ చేయడంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలో చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తే సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు పొలిటికల్ పార్టీలన్నీ సీరియస్ గా దృష్టి సారించాయి.