కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెంకట్రావ్పల్లి సర్పంచ్కు కరోనా టెస్టు చేస్తుండగా స్వాబ్ స్టిక్ (టెస్ట్ చేసే పుల్ల) విరిగి ముక్కులో ఇరుక్కుపోయింది. సిబ్బంది బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ రాలేదు. వెంటనే కరీంనగర్ తరలించగా అక్కడి డాక్టర్ ఎండోస్కోపి ద్వారా బయటికి తీశారు. గోపాల్రావుపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రత్యేక కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రారంభానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ జవ్వాజి శేఖర్ హాజరయ్యారు.
తొలి పరీక్షను ఆయనకే నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాబ్ స్టిక్ చివరి భాగం ముక్కులోనే విరిగిపోయింది. దీంతో హుటాహుటిన కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎండోస్కోపీ ద్వారా దానిని బయటకు తీశారు. స్వాబ్ స్టిక్ విరిగి దానికి చుట్టిన దూదితో సహా ముక్కులోనే ఇరుక్కుపోయింది. అక్కడే ఉన్న డాక్టర్, సిబ్బంది తీసేందుకు ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు.
స్థానికులు వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేట్ఈఎన్టీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్పరిశీలించి ముక్కులో నుంచి గొంతులోకి వెళ్లిందని గుర్తించారు. ఎండోస్కోపి ద్వారా స్వాబ్స్టిక్, దూదిని బయటకి తీశారు. అనుభవం లేని సిబ్బంది టెస్టు చేయడంతోనే ఇలా జరిగిందని సర్పంచ్ ఆరోపించారు. వారి నిర్లక్ష్యంతో నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించానని చెప్పారు. గొంతు నొప్పితో మాట్లాడడం కూడా కష్టమైందని పేర్కొన్నాడు. కరోనా పరీక్షలు నిర్వహించే సమయంలో వైద్యులు నిర్లక్ష్యం వ్యవహరించకూడదని గ్రామ ప్రజలు కోరుతున్నారు.