వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిర పరచే కుట్రకు పాల్పడుతున్నారంటూ ఎంపీ రఘురామరాజును రెండు రోజుల క్రితం ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్లో ని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. రఘురామ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఐడీ అధికారులు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజును హైదరాబాద్కు తరలిస్తున్న వేళ ఆసక్తికర ఘటన ఒకటి వెలుగుచూసింది. కారులో ఉన్నంత సేపు ఎంపీ తన మీసాన్ని మెలేస్తూ కనిపించారు. మీడియా కెమెరాలు కనిపించగానే మీసాన్ని తిప్పుతూ కనిపించడం వెనక ఏదో ఉద్దేశం ఉండే ఉందని చెబుతున్నారు.
ముఖ్యంగా సీఐడీ అధికారులు తనను బలవంతంగా జైలుకు పంపాలన్న పాచిక పారలేదన్న ఉద్దేశంతోనే ఆయనిలా మీసం తిప్పి ఉంటారని అంటున్నారు. ఇంత జరిగాక కూడా ఆయన ప్రభుత్వంపై తన పోరాడటంలో ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదని సూచించారా లేక ప్రభుత్వాన్ని మరింత రెచ్చగొట్టడమా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తనపై కక్ష తీర్చుకోవాలని అనుసరించిన వైఖరి బెడిసికొట్టడంతో నైతికంగా తాను విజయం సాధించానని చెప్పడం కూడా ఆయన ఉద్దేశం అయి ఉంటుందని నాయకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి కొంతకాలంగా కొరకరాని కొయ్యగా మారిన సొంత పార్టీ ఎంపీ రఘురామరాజు వ్యవహారం.. ఇంకా ఎన్ని ఆసక్తికరమైన మలుపులకు, సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది.