గత కొద్దిరోజులుగా ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదం పై ఎన్నో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య నెలకొన్న గ్యాప్ కారణంగా వివాదం ముదిరింది. ఏపీలో సినిమా టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయంటూ సినీ ప్రముఖులు రంగంలోకి దిగారు. కానీ ఏపీ మంత్రులు మాత్రం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనది అని, పేదల కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
తాజాగా సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ టికెట్ రేట్స్ వివాదం పై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “సినిమా టికెట్ రేట్ల విషయమై గతంలో చిరంజీవి వెళ్లి సీఎం జగన్ ని కలిసి వచ్చారు. రేపో, ఎల్లుండో మరోసారి వెళ్లి కలుస్తారని తెలుస్తుంది. నేను, చిరంజీవి గూడుపుఠాణి చెయ్యట్లేదు. వెళ్లేముందు మేము ఏ విషయాలైతే చెప్పాలనుకున్నామో.. ఇలా అందరి ముందు చెబుతున్నాం. ఇప్పుడు అందరికీ ఆన్ లైన్ టికెటింగ్ అలవాటైంది. దీనిపై గవర్నమెంట్, ఫిలిం చాంబర్ కలిసి నిర్ణయం తీసుకోవాలి.
చిన్న సినిమాలకు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ తక్కువ ఉంటాయి. పెద్ద బడ్జెట్, పెద్ద హీరోల సినిమాలకు స్క్రీన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సినిమాలకు వచ్చిన రెవెన్యూ వదిలిపెట్టి టాక్స్ కట్టిన విషయాన్ని చెప్పండి. నెంబర్ ఆఫ్ షోస్ పెంచుకుంటే నాలుగు షోలు పెద్ద సినిమాలకు, ఒక షో చిన్న సినిమాలకు పెట్టుకోవడం వల్ల చిన్న సినిమాలకు కూడా న్యాయం జరుగుతుంది.. అనేది సినీ ప్రముఖుల మాట.
అదేవిధంగా చిన్న సినిమాలకు సబ్సిడీ అందించాలి. మినీ థియేటర్లను కూడా ప్రోత్సహించాలి. సినీ కార్మికులకు GST వేయడం అనేది సరికాదు. సినీ కార్మికులకు ESI, PF లాంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. కమర్షియల్ గా థియేటర్లకు పవర్ చార్జెస్ వేయకూడదు. ఇలాంటివన్నీ చేస్తే మంచిది. కానీ రేట్లు పెంచితే డబ్బులు వస్తాయనుకోవడం భ్రమ. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంటూ పోయి.. దాన్ని ఆడియన్స్ మీద వేద్దామని అనుకోవడం కూడా సినిమావాళ్ల వైపు ఉన్న తప్పు” అని మాట్లాడారు. మరి తమ్మారెడ్డి మాటల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.