‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తమ్మారెడ్డి కామెంట్స్ను నాగబాబు, రాఘవేంద్ర రావు ఖండించారు. తాజాగా ఆ వ్యాఖ్యలకు తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు.
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా దుమ్మురేపింది. అవార్డుల విషయంలోనూ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. హాలీవుడ్లోని ప్రముఖ పురస్కారాలను ఈ సినిమా తన ఖాతాలో వేసుకుంది. ఇందులోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. అలాగే ఆస్కార్కూ నామినేట్ అయ్యిందీ పాట. మార్చి 12న జరగబోయే అవార్డుల వేడుకలో ఈ పాట విజేతగా నిలవాలని యావత్ భారత్ కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘ఆర్ఆర్ఆర్’ గురించి కామెంట్స్ చేయడం వివాదాస్పదంగా మారింది.
‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారని, ఆ డబ్బులతో 8 నుంచి 10 సినిమాలు తీయొచ్చన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. దీంతో తమ్మారెడ్డి మీద ఇండస్ట్రీ పెద్దలు రాఘవేంద్ర రావుతో పాటు మెగా బ్రదర్ నాగబాబు విరుచుకుపడ్డారు. నాగబాబు ఏకంగా తీవ్రపదజాలంతో రియాక్ట్ అయ్యారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు. తాను సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ జవాబుదారీగా ఉంటానని ఆయన అన్నారు. తానేం తప్పు చేయలేదని.. సారీ చెప్పనన్నారు. సెమినార్లో తాను ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో చిన్న సినిమాలు తీసే కొందరు దర్శకులు ఉన్నారని, స్టేజీ మీద ముగ్గురం ఉన్నామని చెప్పారు.
‘ఫిల్మ్ ఫెస్టివల్స్కు ఎలా వెళ్లాలి, అవార్డులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి తదితర అంశాలను సెమినార్లో ఉన్న చిన్న దర్శకులతో చర్చిస్తున్నా. ఆ సందర్భంలో పులిని చూసి నక్క వాతపెట్టుకోకూడదని.. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ మూవీస్ గురించి ఉదాహరణలుగా చెప్పాం. ‘కేజీఎఫ్’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు చూడొచ్చు.. తీయడం కష్టమని చెప్పా. నమ్మిన సినిమాలు తీసుకోండి లేదా వాటి స్థాయిలో భారీగా తీయాలని చెబుతూ తేడాలు ఏంటో మాట్లాడా’ అని తమ్మారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంతకు రెండ్రోజుల ముందే ‘ఆర్ఆర్ఆర్’ గురించి తాను మాట్లాడానని.. ఈ మూవీ భారతదేశానికి గర్వకారణమని చెప్పానని ఆయన గుర్తుచేశారు. అది ఎవరు చూశారో తెలియదు.. గానీ ఈ వీడియోను చూసి కామెంట్స్ చేస్తున్నారని.. ట్వీట్లు కూడా పెడుతున్నారుని తమ్మారెడ్డి పేర్కొన్నారు.
‘రాజమౌళిని చూసి నేను జెలస్ ఫీలవుతున్నానని కొందరు అంటున్నారు. రాజమౌళి గారు ఎక్కడ ఉన్నారు, నేనెక్కడ ఉన్నాను. నేను ఆయన కాంపిటీటర్ను కాదు. నేనేదో కృష్ణా, రామా అని బతుకుతున్నా. బయటివాళ్లు నా మీద కామెంట్స్ చేస్తే పట్టించుకోను. కానీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్లు ఇలా అనడం సరికాదు. నాకు చాలా మంది అకౌంట్స్ తెలుసు. ఎవరెవరు ఏ అవార్డులు, పదవుల కోసం ఎవరెవరిని ఏమేం అడుక్కున్నారో తెలుసు. నేనెప్పుడూ వీటి గురించి మాట్లాడను. నేను మాట్లాడితే ఇండస్ట్రీ పరువు పోతుంది’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.
‘నీయమ్మ మొగుడని ఒకరు నన్ను అన్నారు. నా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పించాడు. నాకు నీతిగా బతకడం, నిజం చెప్పడం నేర్పించాడు. మీకు నేర్పించారా? మీకు నిజం తెలుసా? నిజం చెప్పగలరా మీరు? మీరు చేసిన నిజాలేంటో చెప్తారా? మీకు హక్కుందా నా గురించి మాట్లాడటానికి?’ అని తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. తాను మాట్లాడిన మూడు గంటల వీడియో చూడకుండా.. కేవలం ఓ క్లిప్పింగ్ చూసి ట్వీట్ చేస్తే అయిపోతుందా అని ప్రశ్నించారు. తనను తిట్టిన వారికి సిగ్గుండాలన్నారు. ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే తిరిగి మొహం మీదే పడుతుందన్నారు తమ్మారెడ్డి. మరి.. తమ్మారెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.