టాలీవుడ్లో ఇప్పుడు నంది అవార్డుల అంశం వివాదాస్పదంగా మారింది. కొన్నేళ్లుగా ఈ పురస్కారాలు ఇవ్వకపోవడంతో పలువురు సినీ ప్రముఖులు ఈ అంశంపై ఇటీవల పెదవి విప్పారు. అవార్డుల మీద అనేక అపోహలు ఉన్నాయని చెప్పారు. తాజాగా ఈ వివాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
తెలుగు సినిమాలకు సంబంధించి స్థానికంగా రాష్ట్రస్థాయిలో అత్యున్నత పురస్కారాలుగా నంది అవార్డులను చెబుతారు. ప్రభుత్వం ప్రకటించే అ అవార్డులకు మంచి పేరు, గౌరవం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ పురస్కారాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు ప్రభుత్వంపై కామెంట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది పురస్కారాలు ఇవ్వాలనే ఆసక్తి ఇరు ప్రభుత్వాలకు లేదని, అవార్డుల మీద అనేక అపోహలు ఉన్నాయని రీసెంట్గా కొందరు సినీ ప్రముఖులు విమర్శలు చేశారు. ఈ వివాదంపై తాజాగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
చిత్ర పరిశ్రమ నుంచి ఎవరూ గవర్నమెంట్కు ప్రతిపాదన పంపలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అవార్డులు ఇవ్వాలని ఎవరూ అడగలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఎవరు పడితే వారు అడిగితే నంది పురస్కారాలు ఇవ్వమని ఆయన తేల్చిచెప్పారు. కొందరు మీడియా కనిపిస్తే చాలు.. అత్యుత్సాహంగా మాట్లాడుతున్నారని తలసాని సీరియస్ అయ్యారు. వచ్చే సంవత్సరం రాష్ట్ర సర్కారు తరఫున నంది అవార్డులు ఇస్తామని ఆయన ప్రకటించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు. మరి.. మంత్రి తలసాని వ్యాఖ్యలతోనైనా ఈ కాంట్రవర్సీకి ఫుల్స్టాప్ పడుతుందేమో చూడాలి.