జీవం ఉన్నంతవరకే జీవితం. అతి కొద్దిమంది మాత్రమే మరణానంతర జీవితాన్ని కూడా మహోజ్వలంగా జీవిస్తారు. జనన మరణాల మధ్య కాలమే జీవితం కాదు.. మరణించాక కూడా ప్రతి మదిలో పదిలంగా నిలిచిపోయే శాశ్వత యశస్సును సొంతం చేసుకోటమే జీవితానికి అసలైన అర్థం.. సిసలైన పరమార్థం. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. మరణాన్ని అలాంటి సాధారణ నిర్యాణంలా కాకుండా ఒక మహోజ్వల మానవతా మూర్తి మహాభినిష్క్రమణంలా భావించి రోదిస్తోంది కన్నడ ప్రజ.
కాగా మార్చి 17.. పునీత్ రాజ్ కుమార్ జన్మదినం. అందరూ ఆప్యాయంగా “అప్పు” అని పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ” జేమ్స్”ను అతని జన్మదిన కానుకగా రిలీజ్ చేయటంతో కర్ణాటక రాష్ట్రంలో ఆనంద విషాదాల సమ్మిళిత దృశ్యాలు దర్శనమిచ్చాయి. కేవలం 46 ఏళ్ల వయసులోనే ఒక సినీ తార మరణించడం బాధాకరమే.
పునీత్ కన్నడ చిత్రరంగపు మకుటం లేని మహారాజు. కుటుంబ నేపథ్యం, డబ్బు, కీర్తి వీటన్నింటికంటే తనలోని మానవతా కోణమే అతన్ని మహోన్నతున్ని చేసింది. మనిషి ఎంత గొప్పవాడైనా కావచ్చు.. అతనిలో దాతృత్వ లక్షణం లేకపోతే అవన్నీ నిష్ప్రయోజనమే. పెద్ద – చిన్న, పేద- ధనిక అనే తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా, అభిమానంగా పలకరించే నిష్కల్మష, నిరాడంబర వ్యక్తిత్వమే పునీత్ రాజ్ కుమార్ ను పునీతున్ని చేసింది.
అతని తొలి జయంతిని పురస్కరించుకుని కన్నడ దేశం ఘన నివాళి అర్పించింది. తొలి జయంతితో పాటు అతని చివరి చిత్రం “జేమ్స్” విడుదలను కలిపి ఒక సంయుక్త మహోత్సవంగా నిర్వహించుకున్నారు కన్నడ ప్రజలు. తాజాగా పునీత్ సోదరుడు, నటుడు శివ రాజ్ కుమార్ ఫ్యాన్స్ తో కలిసి థియేటర్లో జేమ్స్ సినిమా చూస్తూ ఎమోషనల్ అయిపోయాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జేమ్స్ చిత్రం ప్రస్తుతం రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరి ఈ ఎమోషనల్ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.