రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇకలేరనే వార్తను ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీ సైతం నమ్మలేకపోతోంది. ఇప్పటికే ఆయన గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రభాస్ కూడా పెదనాన్న లేరనే విషయాన్ని మర్చిపోవడానికి అప్పుడే షూటింగ్ కూడా ప్రారంభించేశాడు అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో సినిమా రీ రిలీజ్లు, 4కే ట్రెండ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక్కడు, పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి, రెబల్ సినిమాలు థియేటర్లలో మళ్లీ విడుదల అయ్యి ఫ్యాన్స్ ని అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్లో ఇదే ట్రెండ్ అయిపోయింది. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా అతను నటించిన మంచి సినిమాలను 4కేలోకి మార్చి మళ్లీ విడుదల చేస్తున్నారు.
ఇప్పడు ప్రభాస్ సినిమా కూడా అదే విధంగా రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పటికే రెబల్ సినిమా మరోసారి బిగ్ స్క్రీన్ మీద చూసి ఫుల్ జోష్ మీదున్నారు. ఇప్పుడు వారికి మరో గుడ్న్యూస్ చెప్పేశారు. అక్టోబర్ 23ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిల్లా సినిమాని 4కేలో రీ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టి ఈనెల 23న బిల్లా 4కే వర్షన్ రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రెస్మీట్లో దర్శకుడు మెహర్ రమేశ్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, కృష్ణంరాజు కుమార్తె సాయి ప్రసీధ, కమెడియన్ అలీ, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. బిల్లా సినిమాని ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ చిత్రబృందం చెప్పుకొచ్చింది.
తండ్రి మరణం తర్వాత కుమార్తె సాయి ప్రసీధ మీడియాతో మాట్లాడారు. బిల్లా సినిమాతో మాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. గోపీకృష్ణా మూవీస్ లో డాడీ, అన్నయ్య కలిసి నటించిన చిత్రంగా బిల్లా సినిమా మాకెంతో స్పెషల్. మా మనసుకు దగ్గరైన సినిమా ఇది. ఈ చిత్రాన్ని మళ్లీ ప్రభాస్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న మళ్లీ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాని 4కేలో రీ రిలీజ్ చేస్తున్నందుకు మెహర్ రమేశ్ అంకుల్కు థాంక్యూ సో మచ్. బిల్లా స్పెషల్ షోస్ ద్వారా వచ్చిన వసూళ్లను యూకే ఇండియా డయోబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ కు ఇవ్వబోతున్నాం. నాన్న గారు ఈ ఫౌండేషన్ లో భాగస్వామిగా ఉన్నారు. ఈ యూకే ఇండియా డయోబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ ద్వారా షుగర్ వ్యాధి తీవ్రమైన రోగులకు చికిత్స అందిస్తున్నాం.” అంటూ సాయి ప్రసీధ చెప్పుకొచ్చారు.