ఏమాత్రం అంచనాలు లేకుండా.. చిన్న చిత్రంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా థియేటర్లలో తన బలం ఎంతో చూపింది. ప్రేక్షకులను కట్టి పడేయడమే కాక.. కలెక్షన్ల సునామీ సృష్టించింది. బలగం చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక తాజాగా మోహన్ బాబు బలగం సినిమా చూశారు. ఆయన ఏమన్నారంటే..
జబర్దస్త్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న వేణు.. దర్శకుడిగా మారి మెగా ఫోన్ చేతపట్టి.. తెరకెక్కించిన చిత్రం బలగం. తొలి ప్రయత్నంలోనే.. భారీ హిట్ కొట్టాడు వేణు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. భారీ వసూళ్లు సాధించడమే కాక.. పలు అవార్డులు కూడా అందుకుంటుంది. నగరాల్లోనే కాక.. గ్రామాల్లో కూడా బలగం సినిమా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి కృత్రిమత్వం జోలికి పోకుండా.. పల్లె వాసనలను, అక్కడి మనుషులు, వారి మనస్తత్వాలను అంతే సహజంగా తెరకెక్కించడంతో సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది. గ్రామాల్లో తెరలు కట్టి మరీ సినిమాను ప్రదర్శిస్తున్నారు. క్లైమాక్స్ సాంగ్ సినిమాను నిలబెట్టింది. బలగం సినిమా చూస్తూ.. కన్నీరు పెట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా ప్రేక్షకుల హృదయాలను కదిలించింది ఈ చిత్రం.
సినిమాపై ఇండస్ట్రీకిచ చెందిన ప్రముఖులు కూడా బలగం సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి.. బలగం దర్శకుడు వేణును ప్రత్యేకంగా అభినందించి సత్కరించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మోహన్ బాబు.. బలగం టీమ్ను ఇంటికి ఆహ్వానించి.. వారిని ప్రశంసించడమే కాక.. సత్కరించాడు. తాజాగా మోహన్ బాబు, విష్ణు ఈ సినిమా చూశారు. వేణు తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన చిత్రం తెరకెక్కించాడని.. సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల్లో జీవించారని ప్రశంసించారు. ఈ క్రమంలో చిత్రంలో నటించిన ప్రియదర్శి, రూపా లక్ష్మితో పాటు దర్శకుడు వేణుని ఇంటికి ఆహ్వానించి.. మోహన్ బాబు, విష్ణు సత్కరించారు.
గ్రామాల్లో బలగం సినిమాను ప్రదర్శించడం పట్ల దిల్ రాజు టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై దిల్ రాజు స్పందించాడు. గ్రామాల్లో ‘బలగం’ చిత్ర ప్రదర్శనలను దిల్ రాజు అడ్డుకుంటారన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. తమ సినిమా ప్రేక్షకులకు చేరువ కావడమే ముఖ్యమని.. వారు ఏ రకంగా బలగం సినిమా చూసినా తమకు ఆనందమేనని తెలిపారు. అలాగే, గ్రామాల్లో జరిగే బలగం ప్రదర్శనలు అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు.
అయితే బలగం చిత్రం స్ట్రీమ్ అవుతోన్న ఓటీటీ సంస్థతో తమకు న్యాయపరమైన ఇబ్బందులున్నాయని, వాటిని తమ సంస్థ పరిష్కరించుకుంటుందని దిల్ రాజు తెలిపారు. ఇంకా గ్రామాల్లో ఏవరైనా బలగం చిత్రం చూడాలనుకుంటే తమకు తెలియజేయాలని.. ఆందుకు తామే స్వయంగా ఏర్పాటు చేస్తామని దిల్ రాజు స్వయంగా ప్రకటించారు. ఇందరి ప్రశంసలు పొందుతున్న బలగం సినిమా మీకు నచ్చిందా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.