మంచు మనోజ్, భూమా మౌనిక రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికే మౌనికకు ఒక కొడుకు ఉన్నారు. అయినా గానీ మనోజ్ పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెతో పాటు ఆమె కొడుకు బాధ్యతలు కూడా తానే తీసుకున్నారు.
ఇటీవలే మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో ఉన్న మంచు లక్ష్మి నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. భూమా మౌనిక రెడ్డి కుటుంబంతో మంచు కుటుంబానికి ఉన్న పరిచయం కారణంగా మొదటి నుంచి స్నేహితులుగా ఉన్నారు. అలా వీరి స్నేహం ప్రేమగా చిగురించి పెళ్లి పీటలు ఎక్కించింది. అయితే భూమా మౌనికకు గతంలో గణేష్ రెడ్డి అనే వ్యాపారవేత్తతో వివాహం జరిగింది.
వీరికి ధైరవ్ రెడ్డి అనే కొడుకు జన్మించాడు. ఆ తర్వాత గణేష్ నుంచి మౌనిక విడిపోయారు. ఇక మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకుని 2019లో విడిపోయారు. ఇటీవలే ఈ ఇద్దరూ రెండో వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఈ సందర్భంగా మౌనికకు భర్తగానే కాకుండా.. ఆమె బిడ్డకు తండ్రిగా అండగా ఉంటానని మనోజ్ హామీ ఇచ్చారు. ఇక ఈ దంపతులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మంచు లక్ష్మి, ఆమె భర్త శ్రీనివాసన్, వారి కూతురు, భూమా మౌనిక రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఈ జంటతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఫోటోల్లో మనోజ్.. మౌనిక బిడ్డను ఎత్తుకుని కనిపించారు. కన్న తండ్రిలా ప్రేమను పంచారు. ఆ బాబు కూడా మనోజ్ పట్ల అంతే ప్రేమగా ఉండడం ఫోటోల్లో కనబడుతుంది. ఇన్నాళ్లు తండ్రి ప్రేమకు దూరమైన బాబుకి ఇన్నాళ్లకు మనోజ్ రూపంలో ఆ ప్రేమ దొరికిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కన్న తండ్రిని మించిన ప్రేమ ఆ పిల్లాడికి అందిస్తున్నారని.. అది మనోజ్ వ్యక్తిత్వానికి నిదర్శనమని కొనియాడుతున్నారు. ఏది ఏమైనా గానీ చాలా మంది రెండో వివాహం చేసుకున్నాక వారి పిల్లలను పెద్దగా పట్టించుకోరు. కానీ మనోజ్ మాత్రం ఈ విషయంలో హుందాగా వ్యవహరిస్తున్నారు. మరి మనోజ్ వ్యక్తిత్వంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.