పర్యావరణం పచ్చగా ఉండాలనే దృఢ సంకల్పంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కి విశేష స్పందన లభిస్తోంది. స్టార్ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. 2019లో టర్కిలో జరిగిన ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం.. ఒక గంటలో మూడు లక్షల మూడు వేల మొక్కలు నాటి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది.
ఇప్పుడు దానికి మిన్నగా ఒక్క గంటలోనే పది లక్షలు మొక్కలు నాటి గిన్నిస్ రికార్డును తిరగరాయాలని నిర్ణయించారు. ఈ మేరకు మొక్కలు కూడా నాటారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వీడియో తీసిన నిర్వాహకులు గిన్నిస్ బుక్ రికార్డ్స్ కోసం పంపనున్నట్లు వెల్లడించారు. మరోవైపు దుర్గా నగర్లో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులకు అందజేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీ ప్రాజెక్ట్ K మూవీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన అమితాబ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో బిగ్బీతో పాటు ఎంపీ సంతోష్కుమార్, హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిల్మ్సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు. భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ను అమితాబ్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత అశ్వనీదత్, ఫిల్మ్సిటీ ఎండీ విజయేశ్వరి కూడా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నాగార్జున కోరారు. సంతోష్ కుమార్ ఇప్పటివరకు 16 కోట్ల మొక్కలు నాటించడం ప్రశంసనీయమని కొనియాడారు.