‘ప్రేమిస్తే’ ఈ లవ్ స్టోరీకి టాలీవుడ్లో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో ఎన్ని లవ్ స్టోరీలు వచ్చినా ఈ సినిమా మాత్రం క్లాసిక్లా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఈ అక్టోబర్ 12కి ఈ సినిమా విడుదలై 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. మురళీ(భరత్) ఒక మెకానిక్, ఐశ్వర్య(సంధ్య) ఒక వైన్ షాప్ ఓనర్ కూతురు. ఇద్దరూ ప్రేమలో పడతారు. పెద్దవాళ్లు పెళ్లికి ఒప్పుకోరని తెలిసి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. వారికి పెళ్లి చేస్తామని తెచ్చి మురళీని కొట్టి.. ఐశ్వర్యకు మరో పెళ్లి చేస్తారు. అది చూసి మురళీ పిచ్చివాడైపోతాడు. ఈ మూవీలో పిల్లల ప్రేమ, పెద్దవాళ్ల మోసం, స్వచ్ఛమైన ప్రేమ తాలూకా ఎమోషన్ తప్ప మరేది ఉండదు, కానీ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
‘నిన్ను నిర్మాతగా చూడాలయ్యా’ అని మెగాస్టార్ చెప్పిన మాటతో.. అప్పటి వరకు జర్నలిస్ట్, పబ్లిషర్, డిస్ట్రిబ్యూటర్గా ఉన్న సురేశ్ కొండేటి ఈ సినిమాతో నిర్మాతగా మారారు. డైరెక్టర్ శంకర్ ప్రొడ్యూసర్గా ఎస్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించిన ‘కాదల్’ చిత్రాన్ని.. నిర్మాత సురేష్ కొండేటి ప్రేమిస్తే పేరుతో తెలుగులో విడుదల చేశారు. డైరెక్టర్ మారుతి కాదల్ సినిమా చూసి దానిని తెలుగులో విడుదల చేద్దామని సురేశ్ కొండేటికి సూచించారంట. మారుతి సైతం గతంలో ఈ ప్రేమిస్తే సినిమా లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడ్ని కాదని చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రేమిస్తే సినిమా తమిళంలో కంటే తెలుగులో ఇంకా అద్భుతమైన విజయం సాధించడం విశేషం.