వైరస్ ల దాడితో మానవాళి మనుగడ ప్రశార్ధకం అయ్యే పరిస్థితిలు తలెత్తాయి. ఒకవైపు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంటే.., మరోవైపు జికా వైరస్ కేరళ వాసులకి చెమటలు పట్టిస్తోంది. తాజాగా కేరళలో ఇలాంటి కేసులు నమోదు అవ్వడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అయితే.., మీకు తెలుసా?జికా వైరస్ కూడా ఓ అంటు వ్యాధి. కానీ.., సరైన జాగ్రత్తలు పాటిస్తే దీని నుండి కూడా బయట పడవచ్చు. ఇలాంటి నేపథ్యంలో అసలు జికా వైరస్ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఏమిటి? ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డెంగ్యూ, మలేరియా లానే జికా కూడా దోమ కాటు వలన వ్యాప్తి చెందుతుంది. ఈడెస్ అనే దోమల ద్వారా ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు పగటి పూట మనుషులను కుడతాయి. జికా వైరస్ను 1947 లో ఆఫ్రికాలో మొదటగా గుర్తించడం జరిగింది. 2015 లో బ్రెజిల్లో వ్యాప్తి చెందింది. ఆ తరువాత మన దేశంలోనూ ఈ కేసులు వెలుగు చూశాయి. దోమ ద్వారా మాత్రమే కాకూండా.., లైంగిక కలయిక ద్వారా కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. దీంతో.., జికా ను ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
జికా సోకిన వారికి ముందుగా జ్వరం వస్తుంది. కానీ.., ప్రాధమిక దశలో రోగ నిర్ధారణ చేయడం కష్టం. జ్వరంతో పాటు.., ముక్కు కారడం, తలనొప్పి, దద్దుర్లు కూడా వస్తాయి. 7 రోజులు ఇలాంటి లక్షణాలే కనిపిస్తూ ఉంటే.., వెంటనే పరీక్ష చేయించుకోవాలి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ కండ్ల కలక, కండరాలు, కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. తరువాత దశలో మెదడు, వెన్నుపాము ఇన్ఫెక్షన్లు వస్తాయి. నాడీ సంబంధిత రుగ్మతలు ఏర్పడుతాయి. కాబట్టి జికా వైరస్ చేసే ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేయకూడదు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జికా వైరస్ కి ఇప్పటి వరకు ఎలాంటి టీకా లేదు. ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు ఈ దిశగా ఇప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ.., జికాతో కరోనా కారణంగా ఏర్పడ్డ ఎమర్జెన్సీ పరిస్థితిలు అయితే ఏర్పడవు. ఈ వ్యాధి సోకినా 90 శాతం మందికి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ.., మెడిటేషన్ తీసుకోవడంలో అశ్రద్ధ చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది.