లేచిన దగ్గర్నుంచి ఉరుకుల పరుగులు లో జీవితం సాగిపోతుంది. క్షణం తీరికలేని జీవితాలు కాస్త సేద తీరాలంటే ప్రకృతి ఒడిలోకి ఓసారి వెళ్లి రావాల్సిందే. ఆ ప్రకృతిలో చల్లని గాలులు చెంపను తాకుతుంటే.. పక్షుల కిలకిలరావాలు చెవుల్లో తేనె పోసినట్టుగా హాయిని పంచుతుంటే.. ఆ హాయిని కోరుకోనివాలుండరు. అలాంటి వారు తప్పక వెళ్లాల్సి ప్రాంతం తెలంగాణలోని సిర్నాపల్లి జలపాతం. ఇటీవల కురిసిన వర్షాలకు సిర్నపల్లి సరస్సు జలపాతం పరవళ్లు తొక్కుతుంది. దీంకో పర్యాటకులతో ఈ ప్రాంతం సందండిగా మారింది. ఈ జలపాతానికి.. తెలంగాణ నయాగరా జలపాతం అని పేరు. మరి.. ఈ జలపాతం విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో ఈ జలపాతం ఉంది. జిల్లా కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్నాపల్లి గ్రామానికి.. మూడు కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవిలో నల్లవెల్లి, సిర్నాపల్లి గ్రామాల్లోని ఆరు చెరువులను నింపడానికి సుమారు రెండు వందల ఏళ్లకు పూర్వం రాణి జానకీబాయి చెరువు తవ్వించారు. సిర్నాపల్లి సంస్థానానికి చెందిన రాణి “సీలం జానకి బాయి” వేల ఎకరాల భూమి కలిగిన భూస్వామి. తన సంస్థానంలో ని ప్రజల తాగు, సాగునీటి అవసరాల కోసం అప్పట్లో చెరువును నిర్మించారు. ప్రస్తుతం ఆ సరస్సు నుండి ప్రవహించే నీరు రామడుగు ప్రాజెక్టు కు ప్రవహిస్తుంది. గత కొన్ని రోజులుగా కురుసోన్న వానలకు తెలంగాణలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
కొన్ని ప్రాంతాల్లో చెరువు, డ్యామ్ లో నిండి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో సిర్నాపల్లి జలపాతం హోయలు పోతోంది. ఇక్కడ చుట్టూ దట్టమైన అడవులు…ఎత్తు నుంచి దూకుతున్న జలపరవళ్లు..పక్షుల కిలకిలరావాలు.. పైరగాలులలతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదాన్ని పంచుతోంది. అప్పుడప్పుడు రైలు కూతలు వినిపిస్తుంటాయి. దీంతో పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుదిరితే మీరు ఓ సారి ఈ తెలంగాణ నయాగరా జలపాతానికి వెళ్లి రండి. సిర్నపల్లి పర్యాటక ప్రాంతం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.