Hyderabad: హైదరాబాద్ మహానగరంలో పర్యాటకుల ఆకర్షణ కేంద్రంగా ప్రసిద్ధి చెందినటువంటి హుస్సేన్ సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. గత మూడు రోజులుగా కురిసిన ఎడతెరిపి లేని వానలకు హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. అయితే.. సాగర్ అసలు నీటిమట్టానికంటే ఎక్కువ వరద నీరు చేరడంతో.. సాగర్ లోతట్టు ప్రాంతాలకు అధికారులు హై అలర్ట్ ప్రకటించినట్లు సమాచారం. ఇక హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 513.50 మీటర్లకు చేరినట్లు తెలుస్తుంది. అయితే.. సాగర్ గరిష్ట నీటిమట్టం 514.75 మీటర్లు మాత్రమేనని.. ఇప్పుడు గరిష్ఠానికి ఒక మీటర్ దూరంలోనే నీరు ఉందని అధికారులు తెలిపారు. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో కూకట్ పల్లి నాలాలో నుండి భారీ వరదనీరు సాగర్ లోకి వచ్చి చేరుతుందని చెబుతున్నారు. అదీగాక మరో రెండు రోజులపాటు వర్షాలు ఉండటంతో తూముల ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.