నారాయణుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రముఖమైన బిందువు శ్రీకృష్ణుడి వద్ద ఉంటుంది. ఎన్నో గొప్ప సిద్ధాంతాలను సులభంగా జీర్ణం చేసుకోగల జ్ఞానాన్ని కృష్ణుడు మనకు అందించాడు. శ్రీకృష్ణుడి ద్వారా వ్యక్తమైన భాగవతతత్వం భగవద్గీత భారతీయ తాత్వికతకు ఆత్మనిచ్చింది. అందుకే కృష్ణుడు జగద్గురువుల్లో ఒకడు. గొప్ప రాజనీతిజ్ఞుడు, తత్త్వవేత్త, రక్షకుడు, శిక్షకుడు. అన్ని నియమాలనూ ఆచరింపజేయగలడు, ఉల్లంఘించగలడు. తన కీర్తి ప్రతిష్ఠలను, అపఖ్యాతులను లెక్కించకుండా ధర్మాధర్మ విచక్షణను ఆచరించగల సమర్థుడు.
విశిష్టమైన మానవశక్తిగా శ్రీమన్నారాయణుడి ఎనిమిదవ అవతారంగా దేవకీవసుదేవుల పుణ్యఫలంగా జన్మించిన శ్రీకృష్ణుడు మానవాళికి భవసాగరం నుంచి బంధ విముక్తి కలిగించే ఆత్మజ్ఞానాన్ని అందించాడు. భూ సంబంధమైన వాసనలు లేని నిర్విరామ ఆనందభావానికి మరొక పేరు శ్రీకృష్ణుడు. ఆయన రూపం ఆనంద స్వరూపం. మోహన రూపం. అది అతీంద్రియం. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణుపురాణం – ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్త్వాన్ని తెలిసికోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు.
శ్రీకృష్ణ పరమాత్ముడు చూపిన భగవద్గీతా మార్గం కేవలం అర్జునునికి మాత్రమే పరిమితం కాలేదు. అది విశ్వమానవాళికి గొప్ప దిక్సూచిగా నిలిచింది. యావత్ ప్రపంచాన్నీ సన్మార్గం వైపు నడిపిస్తున్నది. ఇటువంటి మహత్తర ప్రయోజనాన్ని కలిగించే పని చేసినవాడే ఉత్తమ గురువు. అందుకే, భారతీయ ధర్మం గురువును త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావించి సేవించింది.