అవతార్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను విజువల్ వండర్గా తెరకెక్కించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. సింపుల్ కథతో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. అవతార్ సినిమా కథను ఒక్క ముక్కలో చెప్పాలంటే.. తమ జన్మభూమిని కాపాడుకోవటానికి ఓ జాతి చేసే పోరాటమే ఈ సినిమా. ఉనోబ్టానియం అనే లోహం కోసం కొంతమంది మానవులు పండారా అనే గ్రహంపైకి వెళతారు. గ్రహాన్ని తమ సొంతం చేసుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. నావి అనే జాతి ఇందుకు ఒప్పకోదని తెలిసి వారిని కూడా అంతం చేసి గ్రహాన్ని స్వాధీనం చేసుకోవాలనిచూస్తారు. ఈ నేపథ్యంలోనే ఆ జాతి వారు మనుషులకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెడతారు.
వీరికి కొంతమంది మంచి మనుషులు జత కలుస్తారు. చివరకు పోరాటంలో నావి జాతి విజయం సాధిస్తుంది. వాళ్ల జన్మ భూమి రక్షింపబడుతుంది. అచ్చం ఇలాంటి కథే ఇండియాలో జరిగింది. అది కూడా ఒరిస్సాలోని రాయగడ-రాయగడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో. ఈ కథలో.. ఓ పెద్ద కంపెనీ అటవీ ప్రాంతంలో నివసించే ఓ కొండ జాతికి చెందిన భూమిపై కన్నేస్తుంది. ప్రభుత్వం సహాయంతో దాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది మంచి మనుషులు వీరికి సహాయం చేసి, తమ భూమి కోసం పోరాటం చేసేలా చేస్తారు. చివరకు 10 ఏళ్ల పోరాటం తర్వాత ఆ జాతి విజయం సాధిస్తుంది.
అవతార్ సినిమాకు తీసిపోని కథ..
ఒరిస్సాలోని రాయగడ-రాయగడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో నియాంగిరి అనే ఫారెస్ట్ రేంజ్ ఉంది. ఈ ప్రాంతంలో డోంగ్రియా కోందు అనే ఆటవిక జాతి నివసిస్తోంది. ఈ జాతికి తమ భూమే అన్నీ. కొండ దేవతను నమ్ముకుని కొన్ని వందల ఏళ్లుగా ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఉన్నదాంట్లో తిన్నారు. లేకపోతే అందులోనూ సంతోషాన్ని వెతుక్కుని పస్తులున్నారు. ఏనాడూ అడవిని విడిచి వెళ్లిపోవాలని వారు అనుకోలేదు. అలాంటి వారి జీవితాల్లోకి వేదాంత అనే కంపెనీ ప్రవేశించింది. డోంగ్రియా కోందు జాతి ఉంటున్న అటవీ ప్రాంతంలో విలువైన బాక్సైట్ గనులు ఉన్నాయి. దాని ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఆర్జించవచ్చని కంపెనీ భావించింది. ఈ మేరకు ఏకంగా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. 2003లో అక్కడ మైనింగ్ కు అనుమతులు వచ్చేలా జిమ్మిక్కులు చేసింది. చివరకు ఎలాగైతేనేం మైనింగ్ అనుమతులు వచ్చేశాయి. కంపెనీ లాంజిగఢ్లో రెండు వేల ఎకరాల స్థలంలో అల్యూమినియం శుద్ధి కంపెనీని కట్టించింది. నియాంగిరి కొండల్లో తవ్వకాలు జరపటమే తరువాయి. ఇలాంటి సమయంలో అసలు కథ మొదలైంది.
ప్రజా సంఘాలే హీరోగా ఆదివాసీల పోరాటం!
భారీ యాక్షన్ సీక్వెన్స్లు.. రక్తపాతం లేదు కానీ, తమ జన్మభూమి కోసం డోంగ్రియా కోందు జాతి చేసిన పోరాటం తక్కువ దేమీ కాదు. తమకున్న ఒక్కగానొక్క ఆస్తిని కాపాడుకోవటానికి ఆ జాతి గట్టిగానే పోరాడింది. వీరికి ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. వారిని అన్ని విధాలా తయారు చేసి ముందుకు నడిపించాయి. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కించాయి. దీంతో తవ్వకాలపై స్టే వచ్చింది. అయినా వేదాంత అంతటితో ఆగలేదు. పర్యావరణానికి ఎలాంటి నష్టం చేయమని, స్థానికులను ఆదుకుంటామని చెప్పి స్టేను తొలగించే విధంగా చేసుకుంది. సుప్రీంకోర్టు కొన్ని షరతుల మీద అక్కడ తవ్వకాలు జరపటానికి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటినుంచే కథ రసవత్తరంగా మారింది. ఇలా అయితే, తమ భూమి తమకు దక్కదని భావించిన ఆదివాసీలు ఉద్యమానికి తెరతీశారు. ‘నియాంగిరి సురక్షా సమితి’ని ఏర్పాటు చేశారు. నిరసనలు, ధర్నాలు, బంద్లు ఇలా చాలా కష్టాలు పడ్డారు.
ఆ పోరాటంలో గూండాల దెబ్బలు కూడా తిన్నారు. ఫ్యాక్టరీ కారణంగా జరుగుతున్న ఘోరాన్ని ప్రపంచం కళ్లకు కట్టారు. దీంతో వేదాంత కంపెనీలో షేర్లు పెట్టిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలు తమ వాటాలను వెనక్కు తీసుకున్నాయి. దీంతో కేంద్రం ఆలోచనల్లో పడింది. దీనిపై 2010లో ఓ కమిటీని వేసింది. కమిటీ జరిగే నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో వెల్లడించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆ అనుమతుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు సంవత్సరాలకుపైగా ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. 2013 ఏప్రిల్ 18న తుది తీర్పు వచ్చింది. నియాంగిరిపై మైనింగ్కు అనుమతి ఇచ్చే అధికారం స్థానికులకే ఉందని కోర్టు పేర్కొంది. అయితే, స్థానికులను కూడగట్టి మళ్లీ మైనింగ్ చేయటానికి వేదాంత కంపెనీ ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. ఇక, అవతార్ సినిమా 2009లో రాగా, ఈ పోరాటం 2003 మొదలైంది. ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది కాబట్టి.. జేమ్స్ కామెరూన్ ఈ పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని అవతార్ స్టోరీ తయారు చేసుకున్నాడన్న ప్రచారం ఉంది.