ఒక విషయంలో రోహిత్ శర్మకు అన్యాయం జరుగుతోందని టీమిండియా బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ అంటున్నారు. హిట్మ్యాన్ ప్లేసులో ధోని ఉంటే ఇలా జరిగేదా అని ప్రశ్నిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకడు. సారథిగా ముంబై ఇండియన్స్ జట్టును సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాడు హిట్మ్యాన్. అతడు ముంబైకి ఏకంగా ఐదు సార్లు ట్రోఫీని అందించాడు. పదిహేనో సీజన్లో పేలవ ప్రదర్శన కనబర్చినప్పటికీ దాని నుంచి వేగంగా పుంజుకుని.. ఈ సీజన్లో తిరిగి టీమ్ను కప్ రేసులో నిలిపాడు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్లేయర్లకు వరుస అవకాశాలు ఇస్తూ, వారిని సానబెట్టి స్టార్లుగా తయారు చేయడంలో రోహిత్ పాత్ర ఎంతో ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ముంబై తరఫున బాగా రాణించి, ఆ తర్వాత టీమిండియాలోనూ కీలక ప్లేయర్లుగా ఎదిగారు. అయితే రోహిత్ ఐపీఎల్లో సారథిగా ఇంతగా రాణిస్తున్నా ఎందుకో అతడికి రావాల్సినంత క్రెడిట్ దక్కడం లేదు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి వచ్చినంత పేరు రోహిత్కు రావడం లేదని అంటున్నారు భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్. ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో మీద ముంబై పేసర్ ఆకాశ్ మధ్వాల్ (5/5) అద్భుతంగా బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అతడికి ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించిన రోహిత్ను అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ రోహిత్ ప్లేసులో ధోని ఉంటే అతడికి మరింత క్రెడిట్ ఇచ్చేవారని గవాస్కర్ చెప్పుకొచ్చారు. ‘రోహిత్పై ఎవరికీ పెద్దగా అంచనాలు ఉండవు. అయితే అతడు టీమ్కు ఐదు టైటిల్స్ అందించాడు. ఇక్కడో ఉదాహరణ చెబుతా. ఆకాశ్ మధ్వాల్ ఓవర్ ది వికెట్ బౌలింగ్ వేసి ఆయూష్ బదోనీ వికెట్ తీశాడు. అనంతరం ఫస్ట్ బాల్కే లెఫ్టాండర్ నికోలస్ పూరన్ వికెట్ను రౌండ్ ది వికెట్ ద్వారా ఔట్ చేశాడు. చాలా మంది బాలర్లు ఇలా చేయరు’ అని గవాస్కర్ వివరించారు.
బౌలింగ్లో చిన్న చిన్న మార్పుల ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించొచ్చని గవాస్కర్ పేర్కొన్నారు. ఆకాశ్ మధ్వాల్ ఇదే ప్రదర్శన ధోని కెప్టెన్సీలో చేసి ఉంటే క్రికెట్ ప్రపంచం అతడి గురించి ఎంతో గొప్పగా చెప్పేదన్నారు గవాస్కర్. పూరన్ను ఔట్ చేసేందుకు ధోని వ్యూహ రచనను ప్రతి ఒక్కరూ కాస్త ఎక్కువ చేసి చూపించేవారని ఆయన తెలిపారు. ఇకపోతే, లక్నోతో మ్యాచ్లో రోహిత్ వ్యూహాలను గవాస్కర్ మెచ్చుకున్నారు. ముంబై బ్యాటింగ్ టైమ్లో వధేరాను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నారని.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సాధారణంగా ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటర్లను తీసుకోరన్నారు గవాస్కర్. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు రోహిత్కు క్రెడిట్ ఇవ్వాలన్నారు. ఇకపోతే, శుక్రవారం ముంబై, గుజరాత్ మధ్య జరిగే క్వాలిఫయర్-2తో ఫైనల్స్కు వెళ్లే జట్టేదో తేలిపోనుంది.