ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ నిర్వహణలో బీసీసీఐ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. వర్షం ముప్పు ఉన్న నేపథ్యంలో బోర్డు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారో సీజన్ ఎట్టకేలకు ముగిసింది. టైటిల్ ఫైట్లో గుజరాత్ టైటాన్స్పై నెగ్గి ఐదోసారి ఛాంపియన్గా అవతరించింది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో సీఎస్కే ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అయితే ఈసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహణ విషయంలో బీసీసీఐపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డుగా చెప్పుకునే భారత క్రికెట్ బోర్డు మీద ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోలింగ్కు దిగుతున్నారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారీ వర్షం కురిసింది. కొద్దిసేపటికే తిరిగి మ్యాచ్ మొదలైనా సీఎస్కే ఇన్నింగ్స్ 3 బాల్స్ పడగానే తిరిగి వాన వచ్చేసింది. అరగంట పాటు కురిసిన వర్షానికి మైదానం మొత్తం తడిసి ముద్దయింది.
వర్షం ఆగిన తర్వాత పిచ్ను ఆటకు సిద్ధం చేసేందుకు గ్రౌండ్ సిబ్బంది నానా కష్టాలు పడ్డారు. పిచ్పై ఉన్న వర్షపు నీటిని తొలగించేందుకు స్పాంజీలను వాడారు. అనంతరం పిచ్పై ఉన్న నీటిని తీసేసేందుకు మట్టి వేశారు. అయినా పిచ్ పూర్తిగా ఆరలేదు. దీంతో మరో 45 నిమిషాల పాటు వేచి చూడాలని అంపైర్లు నిర్ణయించారు. వర్షం వల్ల ఆట 10:20 గంటలకు ఆగితే.. తిరిగి 12 గంటల 10 నిమిషాలకు ప్రారంభమైంది. పిచ్ను త్వరగా ఆరబెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది ఇస్ట్రీ పెట్టెలు, హెయిర్ డ్రైయర్లను కూడా వాడింది. వరల్డ్లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరున్న మోడీ స్టేడియాన్ని రూ.వందల కోట్ల ఖర్చుతో అధునాతనంగా తీర్చిదిద్దింది బీసీసీఐ.
స్టేడియాన్ని ఎంత అధునాతనంగా తీర్చిదిద్దినా ఏం లాభం.. వర్షం పడితే నీటిని తొలగించేందుకు స్పాంజీలు, పిచ్ను ఆరబెట్టేందుకు ఇస్త్రీ పెట్టెలు వాడాల్సిన దుస్థితి. దీన్ని బట్టి అక్కడి డ్రైనేజీ సిస్టమ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ బీసీసీఐపై విమర్శలకు దిగుతున్నారు. వేల కోట్లు ఉన్న బీసీసీఐ ఒక్క డ్రైయింగ్ మిషన్ కొనలేదా? ఇది సిగ్గుచేటు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెల్బోర్న్, సిడ్నీ లాంటి స్టేడియాల్లో వర్షం పడితే.. ఆట తిరిగి 15 నిమిషాల్లో మొదలవుతుంది. ఇంగ్లాండ్లో ఎంత వాన పడినా పిచ్ తడవకుండా అధునాతన కవర్లను ఉపయోగిస్తున్నారు. కానీ బీసీసీఐ మాత్రం కవర్లను కప్పినా, పిచ్ తడిసి ముద్దయింది. ఈ కవర్లు గాలికి ఎగిరిపోకుండా బాల్ బాయ్స్ వర్షంలో తడుస్తూ కూర్చోవాల్సి వచ్చింది. మరి.. స్టేడియం డ్రైనేజీ సిస్టమ్ విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BCCI is one of the richest organisation in digital India. So BCCI made one of the best stadium in Ahmadabad with all the modern facilities of Amritkal with the cost of hundreds of Crores of Rupees. Then rain happened during #IPL2023Final and ground staff started to dry ground.🤪… pic.twitter.com/Y0n6Mhiam4
— KRK (@kamaalrkhan) May 30, 2023