ప్రస్తుతం నడుస్తుంది కంప్యూటర్ ఎరా. డిజిటిలైజేషన్ ప్రపంచాన్ని ముందుకి నడుపుతోంది. దీనికి తగ్గట్టే.. ఈరోజుల్లో కంప్యూటర్ జాబ్స్ చేసే వాళ్లు ఎక్కువయ్యారు. సాఫ్ట్ వేర్ రంగంలోనే కాక అనేక ఉద్యోగాల్లో కంప్యూటర్ వాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరంతా ఎక్కువసేపు కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని పని చేయడం అనేది పలు రకాల శారీరక సమస్యలకు దారి తీస్తుంది. వీటిలో ముఖ్యమైనది ఒబెసిటీ (స్థూలకాయం). అధిక బరువు పెరగడం వల్ల వచ్చే ఈ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసే చాలా మందిలో ఈ సమస్యను మనం గమనిస్తూ ఉంటాం.
హైదరాబాద్,బెంగళూర్ లాంటి నగరాల్లో చాలామంది ఉద్యోగులు ఊబకాయంతో ఉండి, దాన్ని తగ్గించుకోవడం కోసం యోగా, వ్యాయామం వంటివి చేయడం మనం ఎక్కువగా చూస్తూంటాం. అలాగే మోకాళ్ల నొప్పులు కూడా డెస్క్ జాబ్స్ చేసే వాళ్లను బాధిస్తూ ఉంటాయి. వీటి వల్ల కండరాలు బలహీనమవుతాయి. ఎక్కువ సేపు కూర్చుని ఉండడం వల్ల మోకాళ్ల మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. ఇలా అధిక బరువు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు తగిన వ్యాయామాలు చేయడం చాలా అవసరం. అలాగే.. డైట్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఇక కొంతమంది ఒకే పని మళ్లీ మళ్లీ చేయడం వల్ల ఒత్తిడి ఎక్కువయ్యి స్ట్రెస్ సిండ్రోమ్స్ వస్తుంటాయి. దీంతో మానసికంగా అలసిపోతుంటారు. ఏ పని మీదా సరిగ్గా దృష్టి కేంద్రీకరించలేరు. ఇలాంటి సమస్య ఉన్న వారు యోగా చేయడం చాలా అవసరం. దీని వల్ల కాస్త ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక అదే పనిగా కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ ఉండేవాళ్లు రేడియేషన్ కు గురి అవుతారు. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువసేపు చూస్తూ ఉండడం వల్ల విజన్ సిండ్రోమ్ వస్తుంది.అందువల్ల కంప్యూటర్ స్క్రీన్ కళ్ళకు తగినంత దూరం ఉండేలా చూసుకోవాలి. దీంతో పాటు.. అద్దాలు వాడటం కూడా అవసరం.
నిజానికి ఆఫీస్ లో పని చేసేటపుడు మధ్యలో అప్పుడప్పుడు లేచి అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. అలాగే మనం మౌస్ ఎక్కువగా వాడుతూ ఉంటాం కనుక దాని కింద మనం ఏదైనా సపోర్ట్ పెట్టుకుంటే చేతికి ఎలాంటి సమస్యలూ వచ్చే అవకాశం ఉండదు. కాళ్లకు సపోర్ట్ గా ఫుట్ రెస్ట్ లాంటివి ఉపయోగించాలి. ఇక ఈ డెస్క్ జాబ్స్ వల్ల వచ్చే అనేక సమస్యలకు ఆయుర్వేదంలో ఎన్నో పరిష్కార మార్గాలున్నాయి. వాటిలో.. మీ సమస్యకి ఏది మంచిదో నిర్ణయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.