ప్రపంచాన్నే గడగడలాడించిన అలెగ్జాండర్ భారతదేశాన్ని కూడా జయించి విశ్వ విజేత అవ్వాలని అనుకున్నాడు. కానీ ఇక్కడ మహా వీరుడి ముందు మోకరిల్లి ప్రాణ భిక్షతో గ్రీకు దేశానికి వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది. అయితే అలెగ్జాండర్ ని పురుషోత్తముడు ఎందుకు చంపకుండా వదిలేశాడో తెలుసా? ఒక రాఖీ అలెగ్జాండర్ ప్రాణాన్ని కాపాడింది.
తనను తాను విశ్వ విజేతగా ప్రకటించుకున్న అలెగ్జాండర్ కి ఓటమిని పరిచయం చేసిన మగాడు, మొనగాడు పురుషోత్తముడు. భారతదేశం వచ్చేవరకూ అలెగ్జాండర్ కి తెలియదు, తాను విశ్వ విజేత కాదన్న విషయం. ఎప్పుడైతే భారతదేశంలో అడుగుపెట్టాడో అప్పుడే అతనొక అపజయుడు అని తేలిపోయింది. అప్పటికే ప్రపంచ దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకుని విశ్వ విజేత అని మురిసిపోతున్నాడు. అయితే అఖండ భారతం అనేది ఒకటుందన్న విషయం తెలుసుకుని.. అదెంత కన్నేస్తే కనురెప్ప వేసినంత సేపట్లో ఆక్రమిస్తా అంటూ బయలుదేరాడు. అప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, బర్మా, టిబెట్, ఆఫ్గనిస్తాన్, నేపాల్, భూటాన్ దేశాలు కలిపి అఖండ భారతదేశంగా ఉండేవి.
ఒక్కో దేశాన్ని ఒక్కో రాజు పాలించేవాడు. అంగ రాజ్యం, మగధ రాజ్యం, కోసల రాజ్యం, అవంతి, కాంభోజ, వజ్జి, కాశీ, కురు, మత్స్య, పాంచాల, గాంధార, శూరసేన, అశ్మక, మల్ల, చేది, వత్స ఇలా 16 రాజ్యాలు కలిసి మహా సామ్రాజ్యంగా అఖండ భారత్ ఉండేది. ఈ రాజ్యాలను ఓడిస్తేనే విశ్వాన్ని గెలిచినట్టు అని అలెగ్జాండర్ భావించాడు. అలా తన సైన్యంతో 326వ సంవత్సరంలో భారతదేశ సరిహద్దులకు వచ్చాడు. యుద్ధం చేయకుండా కొంత కాలం సరిహద్దుల్ దగ్గరే ఎదురుచూశాడు అలెగ్జాండర్. తగిన సమయం కోసం ఎదురుచూస్తున్న అలెగ్జాండర్ ని గాంధార రాజ్యానికి తక్షశిల రాజు అంభి కలిసి యుద్ధం చేయనని చెప్పాడు. గ్రీకు దేశానికి సామంతుడిగా ఉండడానికి అంగీకరించాడు.
ప్రతిఫలంగా పాంచాల రాజ్యాన్ని ఆక్రమించాలని అలెగ్జాండర్ ని అంభి కోరతాడు. అంభికి, పాంచాల రాజు పురుషోత్తముడికి శత్రుత్వం కారణంగా అలెగ్జాండర్ అంగీకరిస్తాడు. పురుషోత్తముడ్ని ఓడించేందుకు అంభి సైన్యాన్ని వాడుకుంటాడు. కానీ పురుషోత్తముడి ధైర్యసాహసాలు, తెగువ, తెలివితేటల ముందు అలెగ్జాండర్ వ్యూహం చతికిలపడింది. యుద్ధానికి ముందు అలెగ్జాండర్ కి బాక్ట్రియాకి చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఈ వివాహాన్ని అడ్డుపెట్టుకుని మధ్య ఆసియా దేశాలను.. ముఖ్యంగా చినాబ్, జీలం నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అనుకున్నాడు. రోక్సానాను వివాహం చేసుకున్న తర్వాత భారత్ పై దండయాత్ర సాగించాడు. అంభి ఉన్నాడు.. ఇక గెలుపు మనదే అని అనుకుని అలెగ్జాండర్.. పురుషోత్తముడికి రాయబారం పంపుతాడు.
తనతో సంధికి ఒప్పుకుంటే సామంతుడిగా ఉండనిస్తా అని.. లేదంటే చంపేస్తా అని వర్తమానం పంపాడు. దానికి పురుషోత్తముడి రక్తం మరిగిపోయింది. కదన రంగంలో తన ఖడ్గం చివర అలెగ్జాండర్ తల ఉన్నప్పుడే సంధి గురించి మాట్లాడతానని పురుషోత్తముడు అనడంతో అలెగ్జాండర్ కి మబ్బులు విడిపోయాయి. సమర శంఖం మోగింది. యుద్ధానికి సన్నాహాలు మొదలయ్యాయి. అయితే పురుషోత్తముడి పరాక్రమం గురించి తెలిసిన రోక్సానా తన పసుపు కుంకుమ గురించి భయపడింది. పురుషోత్తముడితో యుద్ధం అంటే చావుకి ఎదురెళ్ళినట్టే అని అనుకుంది. ఈ యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోతాడని ఆమెకు అర్ధమైపోయింది. ఒకవేళ ఆ పరిస్థితే వస్తే తన భర్తకు ప్రాణ భిక్ష పెట్టమని పురుషోత్తముడ్ని అడుగుతుంది రోక్సానా.
ఒకరోజు ఆమె పురుషోత్తముడి దగ్గరకు వెళ్లి అన్నలా భావించి రాఖీ కడుతుంది. రాఖీ కట్టించుకున్న చెల్లెల్ని పురుషోత్తముడు ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికామె తన భర్త ప్రాణాలతో కావాలని అడుగుతుంది. అందుకు సరే అని పురుషోత్తముడు మాట ఇస్తాడు. యుద్ధ సమయంలో అలెగ్జాండర్ తల పురుషోత్తముడి ఖడ్గం చివర ఉంటుంది. కానీ రోక్సానాకి ఇచ్చిన మాట గుర్తొచ్చి ఆగిపోతాడు. అలెగ్జాండర్ అక్కడ నుంచి పారిపోతాడు. రాజు లేకుండా యుద్ధం ఏమిటని పురుషోత్తముడు యుద్ధం ఆపేస్తాడు.
అలా ఒక రాఖీ కారణంగా అలెగ్జాండర్ ప్రాణం నిలబడింది. లేదంటే పురుషోత్తముడి చేతిలో ఎప్పుడో మరణించేవాడు. కానీ గ్రీకు చరిత్రకారులు మాత్రం కావాలని పురుషోత్తముడి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే అలెగ్జాండర్ మాత్రం పురుషోత్తముడి పరాక్రమానికి అత్యంత ప్రభావితమయ్యాడు. పురుషోత్తముడే అసలైన విశ్వ విజేత అని ప్రకటించాడు. ఇవేమీ మనం బాల్యంలో చదువుకున్న పుస్తకాల్లో ఉండవు. కానీ ఆధునిక చరిత్రకారులు పురుషోత్తముడి వీరత్వం గురించి, అసలు చరిత్ర గురించి బయటపెట్టడం వల్ల మన వీరుడి కథ బయటపడింది. అలా అలెగ్జాండర్ ద గ్రేట్ అన్న అహంకారానికి ఒక రాఖీ అడ్డుకట్ట వేసింది.