హిందువులకు శ్రీరామనవమి ఎంతో ముఖ్యమైన, ప్రీతిపాత్రమైన పండుగ. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పండుగని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే చాలా మందికి శ్రీరామనవమి రోజు పూజ ఎలా చేయాలి? ఆ రోజు ఏం చేయకూడదు? అనే సందేహాలు ఉంటాయి.
హిందువులకు శ్రీరామనవమి ఎంతో ముఖ్యమైన పండుగ. తెలుగురాష్ట్రాలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా శ్రీరామనవమిని వైభవంగా జరుపుకుంటారు. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అభిజిత్ ముహుర్తం అంటే మధ్యాహ్నం 12 గంటలకు. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన ఘడియలను అందరూ శ్రీరామనవమిగా జరుపుకుంటారు. పైగా అదే చైత్ర శుద్ధ నవమి రోజే శ్రీరాముడి వివాహం కూడా జరిగినట్లు చెబుతారు. 14 ఏళ్ల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత చైత్ర శుద్ధ నవమిరోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది అనేది నమ్మకం.
శ్రీరామనవమిని హిందువులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణలోని భద్రాచలం రాములవారి సన్నిధిలో, అయోధ్యలో సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం కన్నులపండువగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తారు. హైదరాబాద్ లో జరిగినట్లుగానే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో శోభాయాత్రలు కూడా జరుగుతాయి. ఇప్పటికీ చాలా సంవత్సరాలుగా శ్రీరామనవమి జరుపుకుంటున్నా కూడా కొందరికి ఎలా జరుపుకోవాలి? శ్రీరామనవమి రోజు ఏం చేయాలి? ఏం పనులు చేయకూడదు? అనే ప్రశ్నలు, అనుమానాలు ఉంటూనే ఉంటాయి. అందుకే శ్రీరామనవమి రోజు పూజ ఎలా చేయాలి? అనే విషయాన్ని తెలుసుకుందాం.
సాధారణంగా ఏ పండుగ అయినా పండితులు చెప్పిన ప్రకారం సూర్యాదయానికి ముందే లేచి తలంటు స్నానం చేయాలి. శ్రీరామనవమి రోజు గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ఇంట్లో ఉండే పూజా మందిరాన్ని కూడా చక్కగా అంలకరించుకోవాలి. స్వామి వారికి వడపప్పు, పానకం నైవేద్యంగా తయారు సమర్పించుకోవాలి. భక్తిశ్రద్ధల్తో స్వామివారిని పూజించుకున్న తర్వాత కల్యాణం, పట్టాభిషేకాలను వీక్షిస్తే శుభం జరుగుతుందని పండితులు చెబుతారు. ఈరోజు ఉపవాసం ఆచరించడం శ్రేష్టం.
అయితే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణీలు ఉపవాసం చేయకుండా ఉంటేనే మంచిది. కాకపోతే వాళ్లు స్వామివారిని స్మరించుకుంటూ.. పాలు, పండ్లు, స్వామివారి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం తీసుకోవచ్చు. రామాయణం చదువుకోవడం, రాముడి అష్టోత్తర శతనామాలు, సీతాదేవి 108 నామాలు, హనుమంతుల వారి 108 నామాలను పటిస్చతూ ఉండాలి. స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం సమయంలో రామ నామం పటిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత రామాలయానికి వెళ్లి స్వామివారి దర్శనం కూడా చేసుకుంటే మంచిది.