అమ్మ అంటే.. ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఒక్కటేమిటి అమ్మగురించి ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. నవ మాసాలు మోసి తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. అమ్మ అంటే రక్షణ.. తన బిడ్డకు ఏ చిన్న ఆపద వచ్చినా తన కంటినుంచి కన్నీరు వస్తుంది. బిడ్డ కోసం ప్రాణాలైనా తృణ ప్రాయంగా ఇస్తుంది. అలాంటిది ఓ తల్లి తన బిడ్డను కడతేర్చింది.. మనసును కలచివేసే ఈ ఘటన జనగామలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జనగామలోని అంబేడ్కర్నగర్కు చెందిన నడిగోటి భాస్కర్, స్వప్న దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు నవనీత్.. కూతురు తేజస్విని. ఏడాది వయసు ఉన్న తేజస్విని కదలలేని స్థితి, అచేతనంగా ఉంటుంది. మరోవైపు నవనీత్ కి గుండెలో రంధ్రం ఉండడంతో రూ.8 లక్షలు ఖర్చుచేసి బైపాస్ సర్జరీ చేయించారు. తేజస్విని ని ఇప్పటి వరకు ఎన్నో ఆసుపత్రుల్లో చూపించారు. ఎక్కడా ఆమెకు నయం అయ్యే అవకాశాలు కనిపించలేదు. దీంతో మరింత కృంగిపోయారు భాస్కర్, స్వప్న.
పుట్టిన ఇద్దరు పిల్లలూ అనారోగ్యం బారిన పడడంతో భాస్కర్, స్వప్న తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ కష్టంతో తట్టుకోలేక స్వప్న కఠిన నిర్ణయం తీసుకుంది. కన్న తల్లి అన్న మమకారాన్ని చంపుకుంది. ఈ క్రమంలో తేజస్విని భవిష్యత్తు భారమవుతుందని భావించిన స్వప్న సోమవారం ఉదయం 11 గంటలకు భర్త లేని సమయంలో ఇంటి ముందున్న నీటి తొట్టిలో పడవేయడంతో పాప మృతిచెందింది. పాప హత్య విషయం తనపైకి రాకుండా ఉండేందుకు స్వప్న ఆగంతకుడు ఈ పని చేశాడని నమ్మబలికే ప్రయత్నం చేసింది.
చైన్ స్నాచర్ ఇంట్లోకి ప్రవేశించి తన పుస్తెలతాడును లాక్కునేందుకు యత్నించాడని, తాను వదలకపోయేసరికి పాప తేజస్వినిని ఎత్తుకెళ్లి ఇంటి ముందు నీటి తొట్టిలో పడవేశాడని చెప్పింది. జనగామ ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ఎలబోయిన శ్రీనివాస్ స్వప్న, ఆమె భర్త భాస్కర్ను విచారించారు. పోలీసులు ముందుగా చైన్ స్నాచర్ పై అనుమానం వచ్చినా.. స్వప్న మాటతీరులో తేడా ఉందని గమనించారు. తమ స్టైల్లో ప్రశ్నించడంతో స్వప్న విస్తుగొలిపే నిజాన్ని వెల్లడించింది.
తమ కుమారుడి గుండె వైద్యానికి ఇప్పటికే ఎంతో ఖర్చు చేశామని.. ప్రస్తుతం తన కుమార్తె తేజస్విని కదలేని స్థితిలో ఉందని, పెంచడం భారంగా అనిపించిందని వెల్లడించింది. బంధువుల సూటిపోటి మాటలు తట్టుకోలేకే తాను పాప ప్రాణాలు తీశానని చెప్పింది. స్వప్న నేరాంగీకార వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ ద్వారా నమోదుచేశారు. స్వప్నను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీసీపీ సీతారాం చెప్పారు. తేజస్వి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.