దొంగలు మళ్లీ పెట్రేగిపోతున్నారు. ఈ సారి ఏకంగా దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా షిర్డీ ఎక్స్ ప్రెస్ పై దాడి చేసి.. మహిళల మెడలోని గొలుసులను కొట్టేశారు. దీంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురౌతున్నారు.
మళ్లీ దేశంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, దుకాణాల్లోనే కాకుండా.. రైళల్లో ప్రయాణీకులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా అటువంటి ఘటనే మహారాష్ట్రలోని ఓ రైల్వే స్టేషన్ లో జరిగింది. స్కెచ్ వేసి మరీ దొంగతనానికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని షిర్డీ నుండి కాకినాడకు వెళ్తున్న షిర్డీ ఎక్స్ ప్రెస్ ఓ రైల్వే స్టేషన్ శివారులో సిగ్నల్ కోసం ఆగింది. అదే అదునుగా చేసుకున్న దొంగలు ఒక్కసారిగా రైలుపై దాడి చేశారు. అందిన కాడికి దోచుకున్నారు. 30 మంది మహిళల మెడలోని బంగారు గొలుసులను చోరీ చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని పర్భణి స్టేషన్ శివారులో సిగ్నల్ కోసం షిర్డీ-కాకినాడ ఎక్స్ప్రెస్ రైలు ఆగింది. ఇదే అదనుగా భావించిన దుండగులు రైలులోకి ప్రవేశించారు. ప్రయాణికులను బెదిరించి, మహిళ మెడలోని గొలుసులు కొట్టేశారు. S2 నుంచి S11 బోగి వరకు మహిళలే లక్ష్యంగా దోపిడీ చేశారు. 30 మంది ప్రయాణికుల నుంచి బంగారం దోచుకెళ్లారు. రైలు పర్భని స్టేషన్ కు రాగానే.. బాధితులు ఆ స్టేషన్లో దిగి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకోవాలని కోరారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
కాగా.. గతంలోనూ ఇదే రైలులో దోపిడీ జరిగింది. అయితే ప్రాంతమే మారింది. మహారాష్ట్రలోని రోటేగావ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు వస్తుండగా దోపిడి దొంగలు ఎస్ 3, ఎస్ 6 బోగీలలోకి ఎక్కారు. ప్రయాణికులపై దాడి చేసి, వారికి మారణాయుధాలు చూపి బెదిరించి పది తులాల బంగారు నగలు, పెద్ద మొత్తంలో నగదును, పలు విలువైన వస్తువులను దోచుకున్నారు. అనంతరం చైన్ లాగి దొంగలు రైలు దిగి పరారయ్యారు. ఇటీవల కాలంలో సైలెంట్ గా ఉన్న దొంగలు.. ఇప్పుడు తెగిస్తున్నారు. దారి దోపిడీలకు తెగబడుతున్నారు. అయితే ఇటువంటి ఘటనలు జరుగుతుండటంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురౌతున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.