ఇటీవల కొంతమంది ప్రతి చిన్న విషయానికి డిప్రేషన్ లోకి వెళ్లడం.. ఆ సమయంలో ఏం చేస్తున్నామో తెలియక క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
ఈ మద్య కొంతమంది చిన్న చిన్న కారణాలకే మనస్థాపానికి గురై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో ఎదుటివారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలకు కూడా పాల్పపడుతున్నారు. తమ తప్పు తెలుసుకునే లోపు జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతున్నాయి. ఓ విద్యార్థి తనను డిబార్ చేశారన్న కోపంతో కాలేజ్ ప్రిన్సిపల్ పై బ్లేడ్ తో హత్యాప్రయత్నం చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ఎగ్జామ్ హాల్ లో కాపీయింగ్ కి పాల్పపడుతూ పట్టుబడితే డిబార్ చేస్తుంటారు. తను పరీక్షలు రాస్తూ కాపీయింగ్ కి పాల్పడటంతో ప్రిన్సిపాల్ డిబార్ చేశారు.. ఇది మనసులో పెట్టుకొని విద్యార్థి సదరు ప్రిన్సిపాల్ పై బ్లేడుతో దాడి చేసి గొంతు కోసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిద్దలూరు చిన్న మసీదు వీధిలో నివాసం ఉంటున్న గొంట్ల గణేష్ అనే విద్యార్థి స్థానిక సాహితి జూనియర్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జామ్ హాల్ లో గత ఏడాది ఇంటర్ పరీక్షలు రాస్తూ కాపీయింగ్ కి పాల్పపడుతూ స్క్వాడ్ కి దొరికిపోయాడు. దీంతో గణేష్ ని డిబార్ చేశారు. అప్పటి నుంచి తనను పట్టించింది కాలేజ్ ప్రిన్సిపాల్ అని గణేష్ అతనిపై కక్ష్య పెంచుకున్నాడు.
సమయం కోసం ఎదురు చూస్తున్న గణేష్ గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రిన్సిపల్ కొండారెడ్డి స్థానిక గాంధీ బొమ్మ కూడలి వద్ద ఉండటం గమనించాడు. ప్రిన్సిపల్ వద్దకు వచ్చి హఠాత్తుగా ఆయనపై బ్లేడు తో మెడపై దాడి చేశాడు.. దాంతో అతడు చేతిని అడ్డు పెట్టడంతో చేతికి గాయం అయ్యింది. స్థానికులు గణేష్ ని ఆపే ప్రయత్నం చేయగా తన వద్ద గొడ్డలి ఉందని.. అందరినీ చంపేస్తా అంటూ హెచ్చరించాడు. స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయాడు గణేష్. ప్రిన్సిపల్ కొండారెడ్డిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశఆలకు తనలించి చికిత్సలు అందించారు. ఈ ఘటనపై సీఐ దేవ ప్రభాకర్ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి కొండారెడ్డితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గణేష్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.