‘యాక్సిడెంట్ అంటే బైకో, కారో రోడ్డు మీద పడిపోవటం కాదు.. ఒక కుటుంబం రోడ్డున పడిపోవడం’ అని సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ చెప్పినా గానీ జనం మారరు. తల మీద ప్రేమ ఉంటేగా, అసలు తల ఉంటేగా దాని గురించి ఆలోచించేది. ప్రజల తలలపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ కొంతమంది ద్విచక్ర వాహనదారులకి లేకుండా పోతుంది. ఎవరి తల మీద వారు శ్రద్ధ చూపించుకుంటే ప్రభుత్వానికి భారం తగ్గుతుంది కదా అంటే వినరు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ఫైన్లు వేస్తున్నారు. కానీ దాని వల్ల ప్రభుత్వ ఖజానాతో పాటు హాస్పిటల్ బెడ్స్ కూడా నిండుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు తమ వంతు ప్రయత్నంగా వాహనదారులతో ఎలాగైనా హెల్మెట్ ధరింపజేయాలని పోలీసులు వినూత్నంగా ఆలోచించారు.
వరంగల్ సిటీలో ఇక నుండి హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల్లో కనబడితే పెట్రోల్ పోయకూడదని బంకు యాజమాన్యాలకి పోలీసులు సూచించారు. హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా.. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీల పరిధిలోని పెట్రోల్ బంకుల వద్ద ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ పేరుతో ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ విధంగా చేస్తున్నామని సిటీ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. ఈ విధానాన్ని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగస్ట్ 15 నుండి అమలులోకి తీసుకురానున్నట్లు ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అంటే ఆగస్ట్ 15 నుండి హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకులకి వెళ్తే పెట్రోల్ పోయరన్నమాట. మరి హెల్మెట్ ధరించి పెట్రోల్ పోయించుకోవడంతో పాటు ప్రాణాలను కూడా కాపాడుకోండి. ఏది ఏమైనా పోలీసులు ఇలా వినూత్నంగా ఆలోచించడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అన్ని పెట్రోల్ బంకుల్లో ఈ విధానాన్ని తీసుకురావాలని, అలానే 4 వీలర్స్కి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా కూడా ఆయిల్ పోయకూడదని కామెంట్స్ చేస్తున్నారు. మరి వాహనదారుల గురించి ఇంత బాధ్యతగా ఆలోచిస్తున్న వరంగల్ పోలీసులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
#NO_HELMET #NO_PETROL pic.twitter.com/Ve2SpiokRw
— CP WARANGAL (@cpwrl) August 11, 2022