లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. జనం నంబర్లు సేకరించడం, లోన్ తీసుకునే వరకూ ఫోన్లు చేయడం, లోన్ చెల్లించకపోతే బెదిరింపులకు పాల్పడడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను వెబ్ సైట్ లో పెడతామని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడతారు. అక్కడితో ఆగకుండా లోన్ తీసుకున్న వ్యక్తి తాలూకా వ్యక్తులకు ఫోన్లు చేసి విసిగిస్తారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి సైతం లోన్ యాప్ నిర్వాహకులు ఫోన్లు చేశారు. మంత్రినే విసిగించారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఒక లోన్ యాప్ కి సంబంధించిన నిర్వాహకులు.. ఒక యువతిని లోన్ తీసుకునేలా ఉసికొల్పి.. తీరా లోన్ చెల్లించలేదని ఆమె ఫోటోలను అశ్లీల వెబ్ సైట్లలో పెడతామని బెదిరించారు.
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాకి చెందిన ఒక మహిళ.. లోన్ యాప్ ద్వారా 3 వేలు రుణం తీసుకుంది. ఆ తర్వాత ఆమెకు తరచూ మరో 15 వేల రూపాయల లోన్ తీసుకోమని ఫోన్లు చేస్తూ వచ్చారు. ఆమె అవసరం లేదని చెప్పినా వినకుండా తరచూ విసిగిస్తూ వచ్చారు. ఆమె ఒక లింక్ క్లిక్ చేస్తే లోన్ పడిపోయేలా ఒక సందేశాన్ని ఆమెకు పంపించారు. ఆమె లింక్ పై క్లిక్ చేయగానే ఆమె ఖాతాలో 15 వేల రూపాయలు పడ్డాయి. అయితే ఆమె లోన్ చెల్లించకపోవడంతో వెంటనే లోన్ చెల్లించాలని ఆమెని వేధించడం మొదలుపెట్టారు. లోన్ చెల్లించకపోతే.. ఆమె ఫోటోలను ఎస్కార్ట్ సర్వీస్ వెబ్ సైట్ లో వ్యభిచారిగా అప్ లోడ్ చేస్తామని బెదిరించారు. లోన్ యాప్ కోసం ఒక గ్యాంగ్ సెపరేట్ గా పని చేస్తుంది.
మొత్తం 5 మంది వ్యక్తులు లోన్లు తీసుకోమని వేధించి.. లోన్ తీసుకున్నాక సకాలంలో చెల్లించకపోతే వేధింపులకు గురి చేస్తున్నారు. వీళ్ళు ఇల్లీగల్ గా టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కూడా మెయింటెయిన్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఒకే ఐఎంఈఐ నంబర్ తో 40 ఫోన్లలో 200 ఫోన్ నంబర్లు మెయింటెయిన్ చేస్తూ.. ఒకే కస్టమర్ కి ఆ నంబర్ల నుంచి కాల్ చేసి వేధిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఒకే ఐఎంఈఐ నంబర్ కావడంతో ట్రాక్ చేయడం కూడా అసాధ్యమని.. అయితే బాధితురాలు ఫిర్యాదుతో ఎట్టకేలకు పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. విదేశీ లోన్ యాప్ లలో లోన్లు తీసుకున్న కస్టమర్లను టార్గెట్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని వెల్లడించారు.
నైజీరియా, ఇండోనేషియా, చైనా దేశాలకి చెందిన లోన్ యాప్ లకు పని చేస్తున్నారని విచారణలో తేలింది. పోలీసులకి దొరక్కుండా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వినియోగించారని పోలీసులు తెలిపారు. మహిళ ఫిర్యాదుతో లోన్ యాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 5గురి వ్యక్తులపై 120బి, 420, ఐటీ యాక్ట్ 20, 21, 25 కింద కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి మొత్తం 600 సిమ్ కార్డులు, 4 ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. నుంచి మరి లోన్ యాప్స్ పై మీ అభిప్రాయమేమిటి? లోన్ యాప్స్ తీసుకునేలా ప్రేరేపించి.. సకాలంలో చెల్లించకపోతే ఫోటోలు అశ్లీల వెబ్ సైట్స్ లో పెడతామని బెదిరించే వారిని ఏం చేయాలి? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.