పెళ్లై ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో అర్థంలేని ఆవేశం.. అంతులేని విషాదాన్ని నింపింది. ఏడు నెలల చిన్నారి అనాధగా మిగిలాడు. ఆ వివరాలు..
వారికి పెళ్లై రెండేండ్లు అవుతోంది. పెద్దలు కుదిర్చిన సంబంధం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతోన్న జీవితం. వారి ప్రేమకు చిహ్నంగా ఏడు నెలల కుమారుడు ఉన్నాడు. సంతోషంగా సాగుతున్న వారిని చూసి విధికి కన్ను కుట్టింది. చిన్న వివాదం కారణంగా వారి జీవితాలు తలకిందులు అయ్యాయి. ఏడు నెలల చిన్నారి భవిష్యత్తు అంధకారం అయ్యింది. ఆకలని ఏడిస్తే.. అక్కున చేర్చుకునే అమ్మ లేదు. ఎత్తుకుని ఆడించేందుకు నాన్న లేడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆకలంటూ ఏడుస్తోన్న ఆ చిన్నారిని చూసి అక్కడున్న వారు.. కన్నీరుమున్నీరుగా విలపించారు. అసలేం జరిగింది అంటే..
మనస్పర్థల కారణంగా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఫలితంగా వారి ఏడు నెలల చిన్నారి అనాథ అయ్యాడు. ఈ విషాదకర సంఘటన కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం, గుడిమిరాళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రంగనాయకులు(28) ఆర్ఎంపీగా పని చేస్తున్నాడు. ఆయనకు లత(25)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడు నెలల క్రితం ఓ కుమారుడు జన్మించాడు. రెండేండ్లు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో కొన్ని రోజులుగా వివాదాలు ప్రారంభం అయ్యాయి. ఆస్తి విషయంలో దంపతులిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈక్రమంలో క్షణికావేశానికి గురైన లత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి చేర్పించి చికిత్స అందిచారు. అయినా ఉపయోగం లేకపోయింది. అదే రోజు అర్థరాత్రి మృతి చెందింది. భార్య మరణించింది అన్న వార్త విన్న రంగనాయకులు మనస్థాపానికి గురై ఆదివారం తెల్లవారుజామున కర్నూలులోని కోట్ల రైల్వే స్టేషన్కు వెళ్లి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించడానికి ముందు రంగనాయకులు తన దగ్గర ఉన్న రూ. 50వేలు సోదరుడికి ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటానాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.