గతంలో ఇరు పొరుగు వాళ్లు కుటుంబ సభ్యులుగా కలిసి ఉండేవారు. కష్ట సుఖాల నుండి.. పండుగలు, వేడుకలొస్తే పిండి వంటల వరకు అన్ని పంచుకునేవారు. చాలా ఆత్మీయులుగా మెలిగేవారు. కానీ ఇటీవల రోజుల్లో మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి కుటుంబాల నుండి న్యూక్లియర్ ఫ్యామిలీలకు వచ్చేశాయి. మనిషి మనో భావాలు మరింత వీక్ అయిపోయి.. ఏ మాట అంటే ఎట్లా తీసుకుంటారో తెలియక.. ఎవ్వరి పని వారూ చూసుకుంటూ నాలుగు గోడల మధ్య బతికేస్తున్నారు. మనిషినే కాదూ జంతువులను కూడా అనలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటిదే ఈ ఘటన.
కుక్కను కుక్క అన్నందుకు 62 వృద్ధుడిని చంపేశారు.. అతడి పొరిగింటోళ్లు. ఈ ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడికొంబు పోలీసు పరిధిలోని ఉలగం పట్టియార్కొట్టంలో రాయప్పన్, నిర్మలా ఫాతిమా రాణి కుటుంబాలు జీవిస్తున్నాయి. ఫాతిమా రాణికి ఇద్దరు కుమారులు డానియేల్, విన్సెంట్. వీరికి ఓ పెంపుడు కుక్క ఉంది. దాన్ని కట్టేయకుండా పలుమార్లు వదిలేస్తుండటంతో దానికి గొలుసు కట్టేయాలని వారిని వేడుకున్నాడు. అయితే రాయప్పన్ దానిని కుక్క అని పిలిచినందుకు, అలా పిలవవద్దని, దానిని పేరు పెట్టి పిలవాలని నిర్మలా కుటుంబం అతడికి వార్నింగ్ ఇచ్చింది.
కాగా, గురువారం తన పొలంలో ఉన్న నీటి పంపును కట్టేయాలని రాయప్పన్ మనవడు కెల్విన్ కు ఆదేశించాడు. అయితే అక్కడ కుక్క ఉంటుందని, తనతో పాటు ఓ కర్ర ను కూడా వెంట తీసుకెళ్లమని మనవడికి చెప్పాడు. ఇది విన్న డానియేల్ కోపంతో ఊగిపోయి రాయప్పన్ పై దూసుకుంటూ వచ్చి, అతడి ఛాతీపై గట్టిగా కొట్టాడు. దీంతో రాయప్పన్ కుప్పకూలి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ కుటుంబ సభ్యులు అక్కడి నుండి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిర్మలా కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి కథనాలు చదువుతున్నప్పుడు మీకేమి అనిపిస్తోంది కామెంట్ల రూపంలో తెలియజేయండి