గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ కూలడంతో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనకు సంబంధించి నదిలో గల్లంతైన మిగతా వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సిట్ దర్యాప్తు చేపట్టగా.. ఈ ఘటనలో బాధ్యులైన 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వారిలో వంతెన నిర్వహణ సంస్థ ఒరెవా గ్రూప్ సంస్థకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు కాంట్రాక్టర్లు, ఇద్దరు టికెట్ క్లర్కులు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు రాజ్ కోట్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దీపావళి సెలవులు కావడం, దానికి తోడు ఆదివారం కావడంతో భారీగా పర్యాటకులు వచ్చారు. అయితే మోర్బీ నగరంలో ఉన్న తీగల వంతెన బ్రిటిష్ కాలం నాటిది కావడంతో కూలిందని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ప్రమాద సమయంలో వంతెన మీద దాదాపు 500 మంది ఉన్నారని, వంతెన కూలడానికి కొంతమంది ఆకతాయిలు కూడా కారణమేనంటూ వెల్లడించారు. కొందరు ఆకతాయిలు ఎగురుతున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. వాళ్ళు అలా ఎగరడం వల్ల కూడా వంతెన కూలిందని అంటున్నారు. వంతెన నిర్వహణ పనులు చేపట్టిన ఒరెవా గ్రూప్ సంస్థ నిర్లక్ష్యం కూడా ఈ దుర్ఘటనకు కారణమని అధికారులు చెబుతున్నారు.
1992 నాటి వేలాడే వంతెన పునరుద్ధరణ, నిర్వహణ పనులను అనుభవం లేనటువంటి ఒరెవా సంస్థ చేపట్టడం మూలంగా ఈ ప్రమాదం సంభవించిందని భవిస్తున్నారు. మరమ్మత్తులకు 8 నుంచి 12 నెలలు సమయం పడుతుందని చెప్పిన సంస్థ.. చెప్పిన దాని కంటే ముందే హడావుడిగా వంతెన మరమ్మత్తు పనులు చేసిందని, ఈ కారణంగానే వంతెన కూలిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి. మోర్బీ పురపాలక శాఖ ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇవ్వకుండానే పెద్ద ఎత్తున పర్యాటకులను వంతెనపైకి అనుమతించింది సదరు ఒరెవా గ్రూప్ సంస్థ. ఆ బరువు మోయలేక వంతెన కూలిపోయిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Morbi Bridge Tragedy: cops arrest 9 people including Oreva staff arrested.
Read the full article: https://t.co/k6IymNTWgT
For more news updates: https://t.co/u2XR6cqVj0#MorbiBridge #Gujarat #Police #Oreva #JaySukhbhaiPatel #Modi #India pic.twitter.com/HlZWERU2LY
— Asiana Times (@AsianaTimes) November 1, 2022
అయితే వంతెన పునఃప్రారంభిస్తున్న విషయం తమకు తెలియదని, తమకు చెప్పకుండానే వంతెనను తిరిగి ప్రారంభించారని మోర్బీ పురపాలకశాఖ చీఫ్ సందీప్ ఝాలా వెల్లడించారు. ఈ కారణంగానే వంతెన భద్రతను తనిఖీ చేయలేకపోయామని తెలిపారు. ఏది ఏమైనా గానీ కొందరి అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఇంతమందికి ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో అయినా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ఘటనను సమీక్షిస్తున్నారు.