ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో తమ ఖ్యాతిని చాటారు. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లో రూ.4 కోట్లకు పైగా ప్యాకేజీతో ఉద్యోగావకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఐఐటీల్లో ఇప్పటివరకు జరిగిన క్యాంపస్ డ్రైవ్లో ఇదే అత్యధిక ప్యాకేజీ ఆఫర్గా చెబుతున్నారు. మొత్తం 3 ఐఐటీల నుంచి ముగ్గురు విద్యార్థులు ఈ ఘనత సాధించినట్లు వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ అధికంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇలాంటి అరుదైన అవకాశాలు ఏటా లభించవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్లేస్మెంట్ ఆఫర్ దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
ఢిల్లీ, కాన్పూర్, బాంబే ఐఐటీల నుంచి ముగ్గురు విద్యార్థులు ఈ రూ.4 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ ట్లేడింగ్ కంపెనీ జేన్ స్ట్రీట్ ఈ ఉద్యోగావకాశాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ కంపెనీకి చెందిన అధికారులు మాత్రం అధికారికంగా ప్రకటించింది లేదు. ప్లేస్మెంట్ నిర్వహించిన ప్రతినిధులు జాతీయ మీడియా సంస్థలతో ఈ వివరాలను పంచుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన అన్ని ప్లేస్మెంట్ ఆఫర్లలో జేన్ స్ట్రీట్ ఇచ్చిన ఆఫర్ అత్యధికమని ప్రకటించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగాలు కూడా ఎక్కువగా లభించినట్లు చెప్పారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నట్లు వివరించారు.
గతేడాది ప్రముఖ క్యాబ్ సర్వీసెస్స్ సంస్థ ఉబెర్.. గరిష్టంగా రూ.2.16 కోట్లతో ఐఐటీ విద్యార్థులకు జాబ్ ఆఫర్ చేసింది. ఇప్పటివరకు ఈ ఏడాది ఐఐటీ రూర్కీలో అంతర్జాతీయ జాబ్ ఆఫర్ ప్యాకేజీ రూ.1.06 కోట్లు. దేశీయంగా అందిన జాబ్ ఆఫర్ రూ.1.03 కోట్లుగా ఉంది. మొదటి రోజు ఐఐటీ రూర్కీ విద్యార్థులు మొత్తం 6 అంతర్జాతీయ జాబ్ ఆఫర్స్ ని సొంతం చేసుకున్నారు. అత్యధికంగా ఐఐటీ మద్రాస్ విద్యార్థులు మొదటి రోజు మొత్తం 445 ఉద్యోగావకాశాలను సొంతం చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువగా ఉంది. మొదటి సెషన్ లో ఐఐటీ మద్రాస్ లో ఏడాదికి కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తంతో 25 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఈ ఏడాది ఇంకా అంతర్జాతీయ సంస్థలు కూడా ఐఐటీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.