ట్విట్టర్ యూజర్లకు ఎలాన్ మస్క్ శుభవార్త చెప్పారు. యూజర్లకు డబ్బులు ఆర్జించే అవకాశాన్ని ఆయన కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
బిలియనీర్ ఎలాన్ మస్క్ అధీనంలోకి వెళ్లిన తర్వాత సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో అనేక మార్పులు జరుగుతున్నాయి. తాజాగా మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూజర్లు తమ కంటెంట్ నుంచి డబ్బులు సంపాదించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. సుదీర్ఘ సమాచారం నుంచి ఎక్కువ నిడివి కలిగిన వీడియోల వరకు దేనికైనా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ను పెట్టుకోవచ్చని మస్క్ తెలిపారు. వాటి ద్వారా డబ్బులు ఆర్జించుకోవచ్చన్నారు. సెట్టింగ్స్లోకి వెళ్లి మానిటైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుందని మస్క్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ అమెరికాలో మాత్రమే ఉందని.. త్వరలో ఇతర దేశాలకు కూడా విస్తరిస్తామన్నారు. కంటెంట్ ద్వారా యూజర్లు సంపాదించిన డబ్బు నుంచి వచ్చే ఏడాది కాలం పాటు ట్విట్టర్ ఏమీ తీసుకోబోదని ఎలాన్ మస్క్ చెప్పారు.
సబ్స్క్రిప్షన్ల ద్వారా వచ్చిన మొత్తంలో గరిష్టంగా 70 శాతం వరకు యూజర్లకే వచ్చేస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా ఆర్జించే మొత్తంలో నుంచి ఐవోఎస్, ఆండ్రాయిండ్ 30 శాతం యాప్స్టోర్ ఫీజు కింద వసూలు చేస్తున్నాయి. వెబ్లో అయితే 92 శాతం వరకు ఆదాయం యూజర్లకే చెందుతుందని మస్క్ మరోమారు స్పష్టం చేశారు. అలాగే కంటెంట్ ప్రమోషన్కూ ట్విట్టర్ సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. కంటెంట్ క్రియేటర్లను ట్విట్టర్లోకి ఆహ్వానించేందుకే మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కంటెంట్ నుంచి డబ్బులు సంపాదించే ఆప్షన్ యూజర్లకు కల్పించడం ద్వారా ప్రముఖ న్యూస్లెటర్ సంస్థ సబ్స్టాక్కు పోటీనివ్వడం కూడా మస్క్ వ్యూహంలో భాగమని టెక్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
Apply to offer your followers subscriptions of any material, from longform text to hours long video!
Just tap on “Monetization” in settings.
— Elon Musk (@elonmusk) April 13, 2023