సంపాదించాలన్న కృషి, పట్టుదల ఉండాలే కానీ ఏ వ్యాపారం అయినా సక్సెస్ బాటలో నడిపించవొచ్చు అని ఎంతోమంది రుజువు చేశారు. వ్యాపారంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడితే సక్సెస్ మన వెంటే ఉంటుందని అంటారు.
ఏ రంగంలో అయినా కష్టపడే తత్వం ఉండాలే గానీ.. ప్రపంచం గర్వించేలా ఘనత సొంతం చేసుకోవచ్చు అని ఎంతోమంది నిరూపించారు. ఏదైనా సాధించాలనే తపన, ఓ లక్ష్యంతో ముందుకు సాగితే డబ్బు మనకు దాసోహం అంటుందని నిరూపించాడు ఓ పాల వ్యాపారి. కేవలం గేదెల ద్వారా వచ్చే పాలు, వాటి ఉత్పత్తులు అమ్మి ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర షోలాపూర్ లో ఉండే ప్రకాశ్ ఇమ్డే అనే ఓ రైతు ఇటీవల కోటి రూపాయలతో ఇంటిని నిర్మించుకున్నాడు. ఆ ఇంటి పై ఓ ఆవు, పాల క్యాన్ విగ్రహాలను ఏర్పాటు చేశాడు. అటుగా వెళ్లే వారిని ఆ రెండు బొమ్మలు బాగా ఆకర్షిస్తున్నాయి. అలా ప్రకాశ్ ఆ రెండు విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఓ బలమైన కారణం ఉందట. తన సక్సెస్ యాత్ర గురించి ప్రకాశ్ ఇమ్డే మాట్లాడుతూ.. ‘నాకు వారసతర్వంగా పూర్వికుల నుంచి నాలుగు ఎకరాల భూమి వచ్చింది. కానీ అది సేద్యానికి పెద్దగా పనికి రాకపోవడంతో చేసేదేమీ లేక పాల వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్న. 1998 లో ఓ ఆవును కొని పాల వ్యాపారం మొదలు పెట్టాను. రోజుకు లీటర్ పాలు అమ్మే స్థాయి నుంచి ఇప్పుడు రోజుకి వెయ్యి లీటర్లు అమ్ముతున్నా. ఆవు పాలు మాత్రమే కాదు.. పేడ కూడా అమ్ముతూ డబ్బు సంపాదిస్తున్నాను’అన్నాడు.
‘పాల వ్యాపారంతో యాడాదికి కోటిన్నర వరకు సంపాదిస్తున్నాను. నా డైరీలో గ్రామంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాను. నా కుటుంబ సభ్యులు అందరూ ఇదే వ్యాపారంలో ఉన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ నన్ను బాపూ.. అని పిలుస్తున్నారు. నేను లక్ష్మీ అనే ఆవును కొనుగోలు చేసి పాల వ్యాపారం మొదలు పెట్టాను. ఆ ఆవు 2006 లో చనిపోయింది. దానికి గుడి కట్టించి ప్రతిరోజూ పూజ చేస్తాను. ఇప్పటి వరకు నేను ఒక్క ఆవు దూడను కూడా అమ్మలేదు. ఇప్పటి వరకు నా వద్ద 160 ఆవులు ఉన్నాయి.. నా ఇంటి పేరు గోదన్ నివాస్ అని పేరు పెట్టుకున్నాను. నాకు ఇంత మంచి పేరు, సంపాదనకు మూలమైన ఆవు, పాల క్యాన్ విగ్రహాలను నా ఇంటిపై ఏర్పాటు చేయించాను’ అని అన్నాడు.