డబ్బు ఒకరి దగ్గరకు రావడం మొదలుపెడితే.. అది వస్తూనే ఉంటుంది. ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు. ఇదే క్రమంలో పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతారు. దీనికి రాజకీయ నాయకులే కారణం అని అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే దేశంలో ఆర్థిక అసమానతలపై రైట్స్ గ్రూప్ ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. భారత్ లో 100 మంది సంపన్నుల సంపద మొత్తం కలిపితే రూ. 54.12 లక్షల కోట్లకు చేరుకుంది. దేశంలోని మొత్తం సంపదలో 40 శాతం సంపద.. ఈ ఒక్క శాతం సంపన్నుల దగ్గరే ఉందని వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం సందర్భంగా తొలిరోజున వెల్లడించిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. అలానే అట్టడుగున ఉన్న సగం జనాభా దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని పేర్కొంది.
సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ పేరుతో దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలపై ఆక్స్ ఫామ్ సంస్థ ఈ విషయాలను బహిర్గతం చేసింది. అంతేకాదు.. ఒకేసారి అపర కుబేరుడైన అదానీపై, అలానే మిగతా సంపన్నుల సంపదపై పన్ను విధిస్తే.. ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో వెల్లడించింది. దేశంలో ఉన్న మొదటి వంద మంది సంపన్నులపై 2.5 శాతం చొప్పున పన్ను విధించినా లేదా మొదటి 10 మంది సంపన్నులపై 5 శాతం పన్ను విధించినా.. డబ్బు లేక స్కూళ్లకు వెళ్లడం మానేసిన పిల్లలందరినీ తిరిగి స్కూళ్లలో చేర్చేంత డబ్బు పన్నుల రూపంలో వస్తుందని తెలిపింది. ఇక అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ మొత్తం సంపదపై ఒకేసారి పన్ను విధిస్తే.. రూ. 1.79 లక్షల కోట్లు వస్తాయని వెల్లడించింది. ఈ డబ్బుతో దేశంలోని ప్రాధమిక పాఠశాలల్లో 50 లక్షల మంది ఉపాధ్యాయులకు ఏడాది పాటు జీతం ఇవ్వవచ్చునని పేర్కొంది.
అలానే మొత్తం దేశంలో ఉన్న సంపన్నులపై ఓకేసారి 2 శాతం పన్ను విధిస్తే.. రూ. 40,423 కోట్ల ఆదాయం వస్తుందని, ఈ డబ్బుతో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలందరికీ మూడేళ్ళ పాటు పోషకాహారం సమకూర్చవచ్చునని తెలిపింది. కరోనా సంక్షోభంలో ఈ సంపన్నుల సంపద భారీగా పెరిగిందని.. అప్పటి నుంచి నవంబర్ 2022 వరకూ 121 శాతం సంపద పెరిగినట్లు తెలిపింది. అంటే రోజుకి రూ. 3,608 కోట్లు సంపాదించినట్లు నివేదికలో వెల్లడించింది. 2020 సంవత్సరంలో దేశంలో సంపన్నుల జాబితా 102 కాగా.. 2022 నాటికి 166 మంది అయ్యారు. ప్రపంచం మొత్తం మీద ఉన్న సంపన్నుల సంపదపై 5 శాతం పన్ను విధిస్తే.. ఆ డబ్బుతో 200 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించవచ్చునని ఆక్స్ ఫామ్ తెలిపింది.
భారత దేశం విషయానికి వస్తే.. 100 మంది సంపన్నుల సంపద దేశ సంపదలో 40 శాతం వాటా కలిగి ఉంది. అంటే ఒక్క శాతం ఉన్న ధనవంతులు 40 శాతం సంపద కలిగి ఉంటే.. అట్టడుగున ఉన్న వారు 3 శాతం సంపదతో బతుకు బండిని లాగిస్తున్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదవాళ్ళు వీళ్ళందరూ కలిపి దేశ సంపదలో 53 శాతం వాటా కలిగి ఉన్నారు. ఇక ఒక మగ కార్మికుడు సంపాదించే కూలీలో ప్రతి రూపాయికి.. మహిళలు కేవలం 63 పైసలు మాత్రమే పొందుతున్నారని తెలిపింది. అదండీ విషయం. వీళ్ళందరూ ఒకేసారి పన్నులు కడితే.. ఆ వచ్చే డబ్బుతో ఇన్ని అద్భుతాలు చేయవచ్చునట. సంపన్నుల దగ్గర ఉన్న డబ్బుతో కాదు.. వారు కట్టే పన్నులతో అద్భుతాలు చేయవచ్చునని ఆక్స్ ఫామ్ తెలిపింది. మరి ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తుందా? లేదా? దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.