మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామం పేరు కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. ఇప్పటం గ్రామంలో రోడ్లను విస్తరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ విస్తరణపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కావాలనే ఇప్పటం గ్రామస్థులను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపణలు, విమర్శలు చేశారు. కొందరైతే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను తొలగిస్తూ వైఎస్సార్ విగ్రహాన్ని మాత్రం కదిలించకుండా వదిలేశారంటూ ఆరోపించారు.
అయితే అవన్నీ అవాస్తవమని అధికారులు సైతం వెల్లడించారు. అంతేకాకుండా అవి ఆరోపణలు మాత్రమే అని నిరూపించామంటున్నారు. ఏవైతే గాంధీ, నెహ్రూ వంటి వారి విగ్రహాలు తొలగించిన ప్రదేశంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని సైతం తొలగించారు. రోడ్డు విస్తరణలో భాగంగా వైస్సార్ విగ్రహాన్ని క్రేన్ సాయంతో అక్కడి నుంచి తరలించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగానే అధికారులు వైఎస్సార్ విగ్రహాన్ని కూడా అక్కడి నుంచి తొలగించామన్నారు. ఈ విగ్రహం గురించే ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.