రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు వచ్చాయి.. పేద ప్రజలకు అండగా ఉంటామని అంటూనే.. తమ వర్గీయులకు కోటీశ్వరులను చేసే పనిలో నిమగ్నం అవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది ముసుగులో దోపిడీ కొనసాగిస్తున్నారు.
రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పరిపాలించిన పార్టీల వల్ల కేవలం 10 శాతం ప్రజలకే ప్రతిఫలం దక్కింది. మిగతా 90 శాతం ప్రజలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగపడగలిగారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక, సామాజిక, రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. ప్రజా సంపద కొందరి చేతిలోనే బంధీ అవుతుంది. ఇప్పటికే దౌర్జన్యాలు, దందాలు, ప్రజా సంపద దోపిడీతో రాష్ట్రానికి, ప్రజలకు ఏ విధంగా నష్టం చేకూరుతోందో మన కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిని మార్చడానికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాల్లోని వారి మద్దతుతో జూలై 23న కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. తద్వారా సరికొత్త మార్పునకు నాంది పలకనున్నాం’ అని చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన రాజకీయ, వ్యాపారవేత్త రామచంద్రయాదవ్ సంచలనాత్మక విషయం వెల్లడించారు. ప్రధానంగా అధికార పార్టీ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడాలన్న లక్ష్యంతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. కొత్త పార్టీ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల గురించి ఇటీవల ఆయన ‘సుమన్ టీవీ’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
విచ్చలవిడిగా అవినీతి:
ఈ రోజు రాష్ట్రంలో ప్రజా సంపద అత్యధికంగా పాలక పార్టీ పెద్దల జేబుల్లోకి వెళ్తోంది. ఇసుక కావచ్చు.. మైనింగ్ కావచ్చు.. రైతుల పేరుతో సాగుతున్న నీటి పారుదల ప్రాజెక్టుల రూపంలో కావచ్చు.. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. అల్పులపై దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. రాష్ట్రంలో ఏ వర్గం అభివృద్ధి చెందిందో చెప్పండి? కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గం, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గం మినహా ఎవరు అభివృద్ధి చెందారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో నాయకత్వాన్ని చంపేస్తున్నారు. ప్రశ్నించే వారు లేకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉదాహరణకు రాష్ట్ర మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే తీసుకుంటే ఆయన అరాచకాలు, దౌర్జన్యాలు చాలా ప్రాంతాల్లో మితిమీరిపోయాయి. ప్రజలందరూ విసుగుచెందారు. అందుకే రేపటి ఎన్నికల్లో ఆయన్ను ఓడించేందుకు పుంగనూరు నియోజకవర్గం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పుంగనూరులో మా పార్టీ జెండా ఎగిరి తీరుతుంది.
పెద్దిరెడ్డి అంటే అవినీతి అనకొండ :
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ ఇంతగా పేట్రేగిపోవడానికి కారణం టీడీపీ, వైఎస్సార్సీపీ పెద్దల ప్రోద్బలమే. ఒకప్పుడు పెద్దిరెడ్డి చిన్న కాంట్రాక్టర్గా.. చిన్న చిన్న పనులు చేసుకునే వారు. బిల్లులు సమయానికి రాకపోతే ఇబ్బంది పడేవారు. ఈ క్రమంలో 1995 తర్వాత చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఇక్కట్లలో కూరుకుపోయారు. అప్పట్లో చిత్తూరు ప్రాంతంలో పెద్దాయనగా పేరుగాంచిన ఆదికేశవులునాయుడు ద్వారా చంద్రబాబుకు వద్దకు వెళ్లారు. ఆయన సహకరించి బిల్లులు విడుదలయ్యేట్లు చూడటంతో ఆర్థికంగా బయటపడ్డారు. 2014 ఎన్నికల్లో ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిధున్రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున రాజంపేట ఎంపీగా పోటీ చేసినప్పుడు టీడీపీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా వారికి బాగా కలిసి వచ్చింది. అప్పుడు ఆ ప్రాంతంలో టీడీపీ బలంగా ఉండింది. అయినప్పటికీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. బలహీనమైన ప్రత్యర్థిపై మిథున్రెడ్డి సునాయాసంగా విజయం సాధించారంటే అందుకు కారణం చంద్రబాబు కాక మరెవరు?
జగన్ ఏలుబడిలో మితిమీరిన అరాచకం:
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి తీరు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా గనుల శాఖలో వ్యవహారాలు శ్రుతిమించాయి. ఏ స్థాయిలో అవినీతి సాగుతోందో కళ్లెదుటే కనిపిస్తోంది. ఇష్టానుసారం లీజులు, లీజుల కొనసాగింపులు.. ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతూ తీవ్ర నిర్ణయాలు పెరిగిపోయాయి. ఇదేమని ప్రశ్నిస్తే పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెడుతున్నారు. స్వయంగా నాపైనే ఎన్నో తప్పుడు కేసులు పెట్టించారు. పుంగనూరులో నేను ఆయనకు ప్రత్యర్థిగా నిలవడం వారికి ఏకోశానా నచ్చలేదు. యువకులకు ఉద్యోగాలు ఇప్పిద్దామని జాబ్ మేళా నిర్వహిస్తుంటే బహిరంగంగానే అడ్డుకున్నారు. ఇది ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనేనా? దీనిని దుర్మార్గం అనరా? ఈ ప్రాంత పిల్లలు వారి కాళ్లపై వారు నిలబడకూడదా? వారికి ఇష్టం వచ్చిన వారు మాత్రమే ప్రత్యర్థులుగా పోటీ చేయాలా? నూటికి నూరు శాతం ఈ పరిస్థితిని మారుస్తాం.
పొలిటికల్ స్పేస్ చాలా ఉంది :
రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ, కొత్తగా ఎన్ని పార్టీలు వచ్చినప్పటికీ ధైర్యంగా ప్రజల కోసం ఎన్ని నిలబడ్డాయన్నదే ప్రధానం. వివిధ రకాల అజెండాలతో ఇప్పటి వరకు పలు పార్టీలు వచ్చి ఉండవచ్చు. పార్టీ నడపాలంటే కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. ఓపిక, ధైర్యం, నిజాయితీ, ప్రజలకు మేలు చేయాలన్న తపన చాలా ముఖ్యం. వీటన్నింటితో పాటు కమిట్మెంట్ ఇంకా ప్రధానం. అవన్నీ నాకు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నేను పోటీ చేశాను. అప్పుడు నేను రాజకీయాలకు కొత్త. అప్పటి పరిస్థితులు వేరు. అందువల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా.. ఇటు అనంతపురం నుంచి అటు శ్రీకాకుళం వరకు పర్యటించాను. అన్ని వర్గాల ప్రముఖులు, సామాన్యులతో మమేకమయ్యాను. వారందరి సూచనలు, సలహాలు.. నా విజన్ను దృష్టిలో ఉంచుకుని కొత్త పార్టీ ఏర్పాటే సబబు అని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. మా పార్టీ విధానం ఏమిటనేది ఈ నెల 23వ తేదీన విస్పష్టంగా ప్రకటిస్తాం.
ఈరోజు పరిస్థితి వేరు :
టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్నాయనేలా వ్యవహరిస్తున్నాయి. ఈ సమయంలో మా పార్టీకి ప్రజాదరణ పుష్కలంగా ఉంటుందని భావిస్తున్నాం. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించాక జరిగిన తొలి ఎన్నికల్లోనే 18 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. అయితే అప్పటి పరిస్థితులు, చిరంజీవి గారి ఆలోచనల మేరకు ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పుడు అలా జరగకుండా ఉండి ఉంటే ఈ రోజు పరిస్థితి వేరుగా ఉండేది. ఇప్పుడు జనసేన పార్టీ ప్రజల మధ్యకు వచ్చినప్పటికీ.. ఆ పార్టీ అభిమానులను కార్యకర్తలుగా, నేతలుగా మలుచుకోలేని పరిస్థితి మనందరికీ కనిపిస్తోంది. ఈ దృష్ట్యా మా పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని రామచంద్ర యాదవ్ వివరించారు.
ఇకపై బడుగు, బలహీనవర్గాల శకం :
‘‘విత్తనం చూడటానికి చిన్నదిగా ఉంటుంది. దానిని భూమిలో నాటితే.. అది మహా వృక్షంగా ఎదిగి ఎందరికో ఫలాలు ఇస్తుంది. అలాంటి రాజకీయ వృక్షాల విత్తనాలు ఎన్నో ఉన్నాయి. వాటిని రాష్ట్ర వ్యాప్తంగా నాటుతాం. బడుగు, బలహీన, మైనారిటీ, పేద వర్గాలకు బాసటగా నిలుస్తాం. సమాజంలో అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న మేమందరం ఒకతాటిపైకి వస్తే మాకేం కావాలో నిర్ణయించుకోవడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఇక బడుగు, బలహీన, మైనారిటీ, పేద వర్గాల శకం ప్రారంభం.’’