ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తరచు వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఓ యువకుడి విషయంలో వార్తల్లో నిలిచారు. అంతేకాక ఇటీవల నియోజకవర్గ పరిశీలకుడు ధనుంజయ్ రెడ్డిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరిశీలకుడిగా వచ్చిన వ్యక్తి నియోజకవర్గంలో అసంతృప్తి వర్గాన్ని రెచ్చగొడుతున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇలా తరచూ ఆసక్తికర వ్యాఖ్యలతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ‘గడపగడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమంలో ప్రభుత్వం తీరుపై మేకపాటి అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో వేసిన రోడ్లకే డబ్బులు రాలేదని, అంతేకాక రోడ్లు వేయడానికి డబ్బులు లేవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో నాగసముద్రం గ్రామసచివాలయం పరిధిలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముచ్చటించారు. ప్రభుత్వ పథకాలు గురించి గ్రామస్థులకు తెలియజేశారు. అలానే స్థానిక సమస్యల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు వేయాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయలేమని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తేల్చి చెప్పారు. రోడ్లు వేసేందుకు డబ్బులు లేవని, ఇప్పటికే వేసిన సీసీ రోడ్లకు డబ్బులు ఇవ్వలేదన్నారు.
అలానే బిల్లులు ఇవ్వకపోవడంతో రోడ్లు వేసిన వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. గతంలో వివిధ రకాల పనులు చేసిన వాళ్లకు ఇప్పటికి వరకు డబ్బులు రాలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనులు చేయడం చాలా కష్టం, ఎవరూ చేస్తారు చెప్పండి అంటూ గ్రామస్థులనే తిరిగి ప్రశ్నించారు. వడ్డీలకు డబ్బులు తెచ్చి మరీ ఎవరు రోడ్లు నిర్మాణం , ఇతర పనులు చేయగలరని.. ఎమ్మెల్యేనే స్వయంగా చెప్పడంతో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అవాక్యయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మరి.. వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.