కలియుగ దైవం, తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకునే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. క్యూలైన్లోని భక్తులకు దర్శనానికి సుమారు 48 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భారీ రద్దీ వల్ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి.. రింగురోడ్డులోని గోగర్భం డ్యాం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దాదాపు 6 కిలోమీటర్ల వరకు భక్తులు బారులు తీరి.. శ్రీవారి దర్శనం కోసి వేచి చూస్తున్నారు. రద్దీ భారీగా పెరగడంతో.. తిరుమలలో వసతి గదులు సరిపోక భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు.. తిరుమలలో పార్కులు, ఫుట్పాత్లు, వసతి షెడ్లలో ఉంటున్నారు.
ఇక క్యూలైన్లలో ఉన్న భక్తులకు దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. క్యూలైన్లలోని భక్తులు.. దర్శనం అయ్యేంతవరకు సహనంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక క్యూలైన్లలోని భక్తులకు శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇక టీటీడీ అధికారలు ఎప్పటికప్పుడు క్యూలైన్లలో రద్దీ, తాజా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
సాధారణంగా తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ రద్దీ ఉంటుంది. దసరా పండుగ పూర్తయ్యేవరకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు, దసరా అయిపోయిన తర్వాత అనూహ్యంగా తిరుమలలో రద్దీ పెరిగింది. దీనికి కారణం.. తమిళులు పవిత్రంగా భావించే పెరటాసి మాసం ఇదే నెల రావడం. ఈ నెలను తమిళులు పవిత్రంగా భావిస్తారు. మరీ ముఖ్యంగా ఈ నెలలో వచ్చే మూడవ శనివారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. దాంతో తమిళనాడు నుంచి భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఫలితంగా తిరుమలలో రద్దీ పెరిగి.. దర్శనానికి ఏకంగా 48 గంటల సమయం పడుతుంది.
రద్దీ నేపథ్యంలో సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో సిఫార్సు లేఖలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. కేవలం ప్రోటోకాల్ భక్తులకు మాత్రమే అనుమతి పరిమితం చేసింది. ఇక ఆన్లైన్ ద్వారా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులకు కేవలం నాలుగు గంటలలోపే స్వామి వారి దర్శనం లభించగా.. సామాన్య భక్తులకు దర్శనానికి ఏకంగా 48 గంటల సమయం పడుతుంది.