తిరుమల అన్నమయ్య భవన్ లో ప్రారంభమైన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా తిరుమలలో అందరికీ ఒకే రకమైన భోజనం ఉండాలి అని నిర్ణయించారు. అందుకు తగిన కార్యచరణ కూడా తర్వలోనే ప్రారంభం కానుంది. ప్రతి భక్తుడికి ఉచితంగా స్వామివారి ప్రసాదంగానే కొండపై భోజనం అందిచాలని నిర్ణయించారు. ప్రధాని నుంచి సామాన్యూడి వరకు అందరికీ ఒకే రకమైన ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అందుకు సంబంధించిన వివరాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ‘తిరుమల కొండపై ఆహారం కొనుక్కుని తినే విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించాం. కొండపై ఉన్న అన్ని ప్రైవేట్ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తొలగిస్తాం. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. రానున్న రోజుల్లో తిరుమల కొండపై అందరికీ ఒకే రకమైన ఆహారం లభిస్తుంది. కొనుక్కుని తినే విధానం ఉండకూడని భావిస్తున్నాం. అలా ప్రసాదం కాకుండా.. వేరే ఆహారం కావాలి అనుకునే వారికోసం ఏమైనా ఏర్పాట్లు చేయచ్చేమో పరిశీలిస్తున్నాం. ఈ నిర్ణయంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వారు నష్టపోయే అవకాశం ఉంది. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా ఏం చేయగలమో ఆలోచించాల్సిందిగా అధికారులను కోరాం’ అంటూ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.
తితిదే పాలకమండలి నిర్ణయాలు