సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహణతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా గుడివాడ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గుడివాడ క్యాసినో విషయంలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ నేడు గుడివాడ చేరుకుంది. మొదట టీడీపీ కార్యాలయానికి చేరుకుని.. ఆ తర్వాత క్యాసినో నిర్వహించిన ప్రాతాన్ని పరిశీలించేందుకు వెళ్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారికి కన్వెన్షన్ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనుమతి లేదంటూ అడ్డగించారు.
అటు టీడీపీ, ఇటు వైసీపీ శ్రేణులు పోటాపోటీగా ర్యాలీలు చేశారు. టీడీపీ నిజ నిరధారణ కమిటీ రావడానికి వీల్లేదంటూ వైకాపా శ్రేణులు పోటీగా ర్యాలీకి దిగారు. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యాలయంపై కొందరు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిని టీడీపీ శ్రేణులు, తీవ్రంగా ఖండిచాయి. ‘పోలీసులే దగ్గరుండి వైకాపా కార్యకర్తలతో దాడి చేయించారు’ అంటూ ఆరోపించారు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నేతలు బొండా ఉమ, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొందరు బొండా ఉమ కారుపై రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో బొండా ఉమ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసుల సహకారంతోనే వైసీపీ కార్యకర్తలు కారును ధ్వంసం చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారంటూ చెబుతున్నారు. క్యాసినో కల్చర్ ను టీడీపీ వ్యతిరేకిస్తోందని.. అక్కడ ఏం జరిగింది అన్నది ప్రజలకు తెలిసేలా చేస్తామంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.