ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి డబ్బు పై ఆశ వుంటుంది. చాలా మంది ఆ డబ్బును సంపాదించడం కోసం తీవ్రంగా కష్టపడుతుంటాడు. కానీ కొందరు మాత్రం కష్ట పడకుండా సులువుగా డబ్బులు సంపాదించాలనుకుంటారు. దీనికోసం మోసాలకు పాల్పడుతుంటారు. మరికొందరు అయితే ప్రభుత్వం ఉద్యోగం, మంచి జీతం వస్తున్న ఇంకా డబ్బు కావాలనే ఆశతో మోసాలకు, అవినీతికి పాల్పడుతుంటారు. అచ్చం అలాగే తాజాగా ఓ పోస్ట్ మాస్టర్ డబ్బుపై ఉన్న ఆశతో పెద్ద మోసానికి పాల్పడ్డాడు. పేద, మధ్యతరగతి ప్రజల నగదు కాజేసి రాత్రికి రాత్రే జంప్ అయ్యాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…
కాకినాడ జిల్లా తాళ్ల రేవు మండలం కేశవపురం గ్రామంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. ప్రజలతో మాటలకు కలిపి వారితో పలు కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో స్కీములు కట్టించుకుంటున్నాడు. ఆ గ్రామంలోని పేద, మధ్యతరగతి ప్రజలు పలు స్కీముల కింద ప్రతి నెల కొంత మొత్తం లో డబ్బు జమ చేసుకుంటున్నారు. అంతే కాదు మరికొంత మంది తమ బంగారం తాకట్టు పెట్టి అతని వద్ద అప్పు తీసుకున్నారు. ఈక్రమంలో పెద్ద మొత్తంలో డబ్బులు, బంగారం తన వద్ద జమ అయ్యే సరికి సుబ్రహ్మణ్యంలో చెడు ఆలోచన పుట్టింది. పక్కప్లాన్ తో అదునుకోసం చూసి లక్షల రూపాయలతో రాత్రికి రాత్రే ఉడాయించాడు.
దీంతో విషయం తెలిసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. బాధితులు కేశవాపురం పోస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయ్యాలని.. ఉన్నతాధికారులు వచ్చే.. తమకు న్యాయం చేసే వరకు కదిలేది లేదని నిరసనకు దిగారు. పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యంను వెతికి తీసుకువచ్చి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటన స్థలంకి చేరుకున్న పోలీసులు.. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు. వీలైనత త్వరగానే నిందితుడిని పట్టుకుంటామని వెల్లడించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.